NRI: హాంకాంగ్‌లో పురివిప్పిన కూచిపూడి నాట్య మయూరాలు

ABN , First Publish Date - 2023-07-04T12:20:49+05:30 IST

కూచిపూడి నృత్యం అనగానే చురుగ్గా లయ బద్ధoగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైన దేహ భంగిమలు, హస్తలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు గుర్తుకు వస్తాయి.

NRI: హాంకాంగ్‌లో పురివిప్పిన కూచిపూడి నాట్య మయూరాలు

NRI: కూచిపూడి నృత్యం అనగానే చురుగ్గా లయ బద్ధoగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైన దేహ భంగిమలు, హస్తలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు గుర్తుకు వస్తాయి. ముఖాభినయంతో కూచిపూడి నృత్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఒకటైన కూచిపూడి నాట్య నాటక నృత్యాన్ని హాంకాంగ్‌లో తొలి సారిగా పరిచయం చేసిన స్థానిక కూచిపూడి నాట్యాచార్యులు ఈరంకి శ్రీహరి బాలాదిత్య (హరిఓం) తమ ఇద్దరు విద్యార్థుల రంగప్రవేశం ఎంతో వైభవంగా నిర్వహించారు.

N.jpg

శిష్యులు సింథియా లావ్ మే 25న, జాకీ లా జూన్ 26న కూచిపుడి రంగప్రవేశం చేసి, తమ ప్రదర్శనతో ప్రేక్షకులని అలరించారు. రెండు కార్యక్రమాలు కుంటాన్గ్ క్రిస్టియన్ ఫ్యామిలీ సర్వీస్ సెంటర్ ఆడిటోరియంలో హరిఓం డాన్స్ సొసైటీ, చిల్డ్రన్స్ కల్చరల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డాయి. మే 25 కార్యక్రమంలో స్థానిక ప్రముఖ కథక్ గురువు శ్వేతా రాజపుత్ ముఖ్య అతిథిగా విచ్చేయగా.. జూన్ 26 కార్యక్రమంలో స్థానిక ప్రముఖ కథక్ గురువు నిషా ఝవేరి, కాన్సులర్ సర్వీసెస్ కాన్సుల్ కే. వెంకట రమణ, డాక్టర్ సంజయ్ నాగర్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా కే. వెంకట రమణ మాట్లాడుతూ.. మన భారతీయ నాట్య శాస్త్ర ప్రాముఖ్యతను వివరించి, విదేశీయులు నేర్చుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

NN.jpg

హాంగ్‌కాంగ్‌లో పుట్టి పెరిగినా, మన భారతీయ కళలపై ఆసక్తితో మన తెలుగు సంస్కృతీ చిహ్నమైన కూచిపూడి నాట్యాన్ని 15 సంవత్సరాలుగా అభ్యసించి ప్రదర్శించడం ప్రశంసనీయం అని అన్నారు. అంతేగాక వారికి నాట్య వస్త్రాలు, నగలు, మేకప్ చేసుకోవడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. అయినా అలుపు ఎరుగక తమకు కూచిపూడి నాట్యం పట్ల శ్రద్ధ - మక్కువలో ఎటువంటి సడలింపు కలగడం లేదు కదా వారి పట్టుదల మక్కువ పెరుగుతూనే వుంది.. జోయి చాన్ మరియు సిసిలియా చాన్ దాదాపు రెండు దశాబ్దాలుగా మన భారతీయ నాట్యం ప్రదర్శిస్తున్న హాంగ్ కాంగ్ కళాకారులకి మేకప్ చేస్తూ అందరి ప్రేమ అభిమానాలు పొందుతున్నారు.

NNN.jpg

మే 25 సింథియా లావ్ ప్రదర్శనలో పూర్వరంగం తరువాత శ్రీ సకల గణాధిప పాలయమాంతో ప్రారంభించి, అన్నమయ్య కీర్తన నందకధర, ధనశ్రీ తిల్లాన, రుక్మిణి ప్రవేశం, నాయక జావళి, కూచిపూడి సలాము నృత్యాంశాలు ప్రదర్శించారు. జూన్ 26 జాకీ లా ప్రదర్శనలో పూర్వరంగం తరువాత మామవతు శ్రీ సరస్వతితో ప్రారంభించి భామాకలాపంలో మూడు ముఖ్యాంశాలను ప్రదర్శించారు. అందులో భాగంగా ప్రవేశ దరువు, సత్యభామ మాధవి సంభాషణ, మదన దరువు నయనానందకరంగా ప్రదర్శించారు. కార్యక్రమములో ఇంకా భో శంభో, భాగేశ్వరి తిల్లాన, గోవర్ధన గిరిధార తరంగం కూడా ప్రదర్శించారు.

NNNNN.jpg

కూచిపూడి నేర్చుకొంటున్న మహిళలలో చాలా వరకు గృహిణిలు, ఉద్యోగస్తులు ఉన్నారని ది హ్యాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి తెలిపారు. వారిది మన దేశం కాదు, మన భాష కాదు, మన సంస్కృతీ కాదు, మన కట్టు బొట్టు కాదు, అయినా వారికి మన కూచిపూడి నాట్యం పట్ల వున్న అభిమానానికి, నేర్చుకోవాలన్న ఆసక్తి, నిబద్ధత ప్రశంసనీయమన్నారు. అందుకు వారి గురువు శ్రీహరి కృషి కూడా ఎంతో ఉందన్నారు. హాంకాంగ్‌ ప్రదర్శనలలో పాల్గొనడమే కాదు, విదేశాలలో కూడా వీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. కళలకు, కళాకారులకు సరిహద్దులు లేవని, కళాభిమానానికి హద్దులు లేవని హాంకాంగ్‌ నాట్య మయూరాలే చక్కటి ఉదాహరణలు అని ఆమె అన్నారు.

1.jpg

Updated Date - 2023-07-04T13:52:24+05:30 IST