US: అగ్రరాజ్యంలో విషాదం.. భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. మెదడు దెబ్బతిని కోమాలోకి..

ABN , First Publish Date - 2023-07-21T10:06:22+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.

US: అగ్రరాజ్యంలో విషాదం.. భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. మెదడు దెబ్బతిని కోమాలోకి..

హ్యూస్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నతచదువుల కోసం యూఎస్ వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురైంది (Lightning Strike). ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుదేలైన బాధితురాలి గుండె (Heart) లయ తప్పింది. బ్రెయిన్ కూడా డ్యామేజీ (Brain Damage) కావడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన 25 ఏళ్ల సుశ్రూణ్య కోడూరు (Susroonya Koduru) యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తోంది. జూలై మొదటివారంలో ఆమె కొంతమంది స్నేహితులతో కలిసి స్థానికంగా ఉండే శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌ (San Jacinto Monument Park) కు వెళ్లింది. అక్కడి ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళ్తుంది.

అయితే, అప్పటికే వాతావరణం ముసురుపెట్టి చిన్నగా వర్షం మొదలైంది. క్రమంగా పెరిగిన వర్షం ఉరుములు, మెరుపులతో జడివానగా మారింది. అదే సమయంలో ఊహించనివిధంగా సుశ్రూణ్యపై పిడుగుపడింది. దాంతో ఆమె పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. ఆ సమయంలో ఆమె గుండె 20 నిమిషాల పాటు ఆగిపోయింది (Cardiac arrest for 20 minutes). దీంతో రక్తప్రసరణ నిలిచిపోవడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి (Coma) వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు బాధితురాలి కజిన్ సురేంద్ర కుమార్ కోతా (Surendra Kumar Kotha) చెప్పారు. విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టారు. దాతలు 'గోఫండ్‌మీ' (GoFundMe) ద్వారా ఆర్థిక సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.

H-1B Visa: హెచ్ 1బీ వీసాదారులకు వర్క్ పర్మిట్.. కెనడా పథకానికి భారీ స్పందన..!


Updated Date - 2023-07-21T10:18:51+05:30 IST