Indian consulate in San Francisco: ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్య.. భారత కాన్సులేట్‌‌కు నిప్పు!

ABN , First Publish Date - 2023-07-05T07:34:30+05:30 IST

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌ కార్యాలయానికి ఖలిస్థానీ వేర్పాటువాదులు నిప్పుపెట్టారు.

Indian consulate in San Francisco: ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్య.. భారత కాన్సులేట్‌‌కు నిప్పు!

అమెరికాలో ఖలిస్థానీ రాడికల్స్‌ ఘాతుకం.. ఈ ఏడాది మార్చి నుంచి ఇది రెండో ఘటన

కెనడాలోనూ ఖలిస్థానీ పోస్టర్ల హల్‌చల్‌

కెనడా హైకమిషనర్‌కు కేంద్రం సమన్లు

న్యూఢిల్లీ, జూలై 4: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌ కార్యాలయానికి ఖలిస్థానీ వేర్పాటువాదులు నిప్పుపెట్టారు. ఆదివారం అర్ధరాత్రి 1.30 - 2.30 గంటల మధ్య ఈ దారుణం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో పెద్దగా నష్టం సంభవించలేదు. ఈ కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడి చేయడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. అమృత్‌పాల్‌ సింగ్‌, అతని అనుచరుల అరెస్టు సందర్భంగా ఈ ఏడాది మార్చి 19న తొలిసారిగా ఈ కార్యాలయంపై ఖలిస్థానీ రాడికల్స్‌ దాడికి పాల్పడ్డారు. కార్యాలయానికి నిప్పు పెట్టిన వీడియోను ఖలిస్థానీ మద్దతుదారులు ఆదివారం ట్వీట్‌ చేశారు. కెనడాకు చెందిన ఖలిస్థానీ టైగర్‌ ఫోర్స్‌(కేటీఎఫ్‌) చీఫ్‌ హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ మరణ వార్తలను కూడా దీనికి జతచేశారు.

భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అయిన హర్దీ్‌పను గతనెల 18న కెనడాలోని ఓ గురుద్వారా బయట కాల్చిచంపారు. కాగా, ఈనెల 8న శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ వరకు ఖలిస్థాన్‌ ఫ్రీడం ర్యాలీ నిర్వహించనున్నట్టు సోషల్‌ మీడియాలో మరో పోస్టు ఉంచారు. ఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై దాడి చేయడం క్రిమినల్‌ నేరమని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ పేర్కొన్నారు. మరోవైపు ఖలిస్థానీ సిద్ధాంతాలకు తమ దేశాల్లో స్థానం ఇవ్వొద్దని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ర్టేలియా తదితర దేశాలను భారత్‌ కోరిందని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ సోమవారం వెల్లడించారు. ‘ఖలిస్థానీ సిద్ధాంతాలు దౌత్య సంబంధాలకు మంచిది కాదు’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.

దౌత్యవేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నాం

కెనడాలోనూ ఖలిస్థాన్‌ మద్దతుదారుల కార్యకలాపాలు తీవ్రమవుతుండటతో భారత ప్రభుత్వం మంగళవారం కెనడా హైకమిషనర్‌ కామెరాన్‌ మెకాయోవ్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈనెల 8న కెనడాలోని టొరంటో నగరంలో ‘ఫ్రీడం ర్యాలీ’ నిర్వహించనున్నట్టు వెలిసిన పోస్టర్ల గురించి ప్రశ్నించింది. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ చావుకు ఒట్టావోలోని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ, టొరంటోలోని కాన్సుల్‌ జనరల్‌ అపూర్వ శ్రీవాస్తవ కారణమంటూ ఆ పోస్టర్లలో రాసిన విషయాన్నీ ప్రస్తావించింది. ఈ పోస్టర్ల నేపథ్యంలో భారత దౌత్యవేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నామని కెనడా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. దౌత్యవేత్తల భద్రత అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని కెనడా విదేశాంగమంత్రి మెలానీ జోలీ ప్రకటించారు.

భారత దర్యాప్తు సంస్థలు అప్రమత్తం

వేర్పాటువాద అగ్రనేతలు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌, పరంజీత్‌ సింగ్‌ పన్వర్‌, అవతార్‌ సింగ్‌ ఖండా మరణాలకు ప్రతీకారంగా భారత దౌత్యవేత్తలు, హిందూ నాయకులపై దాడులు జరిపేందుకు ఖలిస్థానీలు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందడంతో భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్‌లోని హిందూ నేతలపై దాడికి ఖలిస్థాన్‌ అనుకూల సంస్థలు(పీకేఈ) కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఇద్దరు హిందూ నేతలకు ముప్పు పొంచి ఉందని నివేదికలు అందినట్టు చెప్పారు. దీంతోపాటు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ర్టేలియా తదితర దేశాల్లోని భారతీయ కాన్సులేట్‌ల బయట ఈనెల 8న హింసాత్మక నిరసనలకు పీకేఈలు కుట్ర పన్నినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీకేఈల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, భారత కాన్సులేట్‌లకు భద్రత పెంచేందుకు ఆ దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నట్టు వివరించారు.

Updated Date - 2023-07-05T07:34:30+05:30 IST