Telugu Expat: ఫోన్ స్క్రీన్ లాక్‌తో వచ్చిన తంటా.. సరియైన గుర్తింపు లేని కారణంగా 7 నెలలుగా ఎడారిలో తెలుగు ప్రవాసీ మృతదేహాం

ABN , First Publish Date - 2023-03-30T08:53:35+05:30 IST

ఎడారి దేశాలలో మనిషి మనుగడ మోత్తం వీసాపై ఆధారపడుతుంది.

Telugu Expat: ఫోన్ స్క్రీన్ లాక్‌తో వచ్చిన తంటా.. సరియైన గుర్తింపు లేని కారణంగా 7 నెలలుగా ఎడారిలో తెలుగు ప్రవాసీ మృతదేహాం

చావుకు తప్పని వీసా సమస్య

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలో మనిషి మనుగడ మోత్తం వీసాపై ఆధారపడుతుంది. జీవితం నుండి మరణం వరకు వీసా కేంద్రీకృతమైన విధానంలో ఒక్కసారి వీసా గడువు ముగిస్తే చాలు సవాలక్ష సమస్యలు. జీవనంలో కాదు మరణించిన తర్వాత కూడా ఉనికి కోల్పోతాడు.​అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి మండలానికి చెందిన పట్టన్ రెడ్డీ హానీఫ్ ఖాన్ (39) వీసా గడువు ముగియడంతో అక్రమంగా సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. తన వీసా ముగియడంతో తనకు తెలిసిన ఒక వ్యక్తి పేరుపై ఇంటిని అద్దెకి తీసుకుని రియాధ్ నగరంలో గత కొన్నాళ్ళుగా ఉంటున్నాడు. సరైన ఉద్యోగం లేకపోవడానికి తోడుగా డబ్బు ఆశకు థాయలాండ్ లాటరీకి అలవాటుపడ్డాడు. గల్ఫ్ దేశాలలో థాయలాండ్ లాటరీ వ్యసనానికి బానిసలుగా మారే వారిలో తెలుగు ప్రవాసీయులు లక్షలలో ఉన్నారు. థాయలాండ్ లాటరీలో ఎంత ట్రై చేసినా అదృష్టం కలిసిరాకపోవడం, అటు ఉద్యోగం లేక ఆర్ధిక ఇబ్బందులు పెరగిపోవడంతో జీవితంపై విరక్తి చెందిన హానీఫ్ గతేడాది అక్టోబర్ 22న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతరం కొన్ని రోజులకు ఇంటి నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులకు ఇంట్లో కుళ్ళిపోయిన మృతదేహాం లభించింది. హనీఫ్ ఖాన్ వీసా గడువు ముగియడంతో తన పేరిట కాకుండా ఇతరుల పేర ఇల్లు అద్దెకు తీసుకోని ఉండడంతో దాని ఆధారంగా ఇతర వ్యక్తి మరణించినట్లుగా భావించి సదరు వ్యక్తి అరబ్బు యాజమానికి సమాచారం ఇచ్చారు. కానీ, ఆ వ్యక్తి మరణించలేదని, జీవించి ఉన్నాడని తన వద్ద పని చేస్తున్నాడని యాజమాని చెప్పడంతో మృతదేహాం వేలి ముద్రలు సేకరించగా అందులో హనీఫ్ ఖాన్ పేరు, వీసా నెంబర్ వచ్చాయి. అయితే, అతని పాస్ పోర్టులోని ఒక అంకె తప్పుగా ఉండడంతో చిరునామా తెలుసుకోవడం సమస్యగా మారింది.

ఇది కూడా చదవండి: హెచ్‌1బీ వీసా కోటా పూర్తి.. అర్హులైన వారు తదుపరి చర్యలు ప్రారంభించుకోవచ్చు..

సెల్ ఫోన్ లాక్ చేసుకుని ఉండడం సమస్యను మరింత జటిలం చేసింది. చివరకు ఎలాగోలా ఫోన్‌ను తెరిచి అందులోని నెంబర్లకు డయల్ చేయగా దానికి ఇండియా కంట్రి కోడ్ లేకపోవడంతో మరో ఇబ్బంది తలెత్తింది. దాంతో భారత్ కంట్రీ కోడ్ 91 యాడ్ చేసి కొన్ని నంబర్లకు కాల్ చేయడంతో చివరకు ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు. తాము భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సమీపంలో ఉంటామని చెప్పడంతో పాటు ఈ ఫోన్ తమ సోదరుడిదని చెప్పాడు. అలా చనిపోయింది తెలుగు వ్యక్తి అని గుర్తించడానికి సుమారు ఏడు నెలల వ్యవధి పట్టింది. మృతదేహాం ప్రస్తుతం మార్చురీలో ఉంది, దాన్ని సిద్దీఖ్ తువూర్ అనే సామాజిక కార్యకర్త సహాయంతో త్వరలో స్వదేశానికి పంపించడానికి భారతీయ ఎంబసీ ప్రయత్నిస్తుంది.​ఇక చాలా మంది తమ మొబైల్ ఫోన్లను లాక్ చేసుకోవడంతో అత్యవసర సందర్భాలలో ఈ కారణాన దగ్గరి బంధు మిత్రులను సంప్రదించడంలో ఇబ్బంది ఎదురయి జాప్యం జరుగుతుందని తెలుగు సామాజిక కార్యకర్త ముజమ్మీల్ శేఖ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇండియాలో బాగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. ఇక అమెరికా వీసా చాలా ఈజీ!

Updated Date - 2023-03-30T09:19:03+05:30 IST