Manipur : మణిపూర్‌ మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం సీజే ఆవేదన

ABN , First Publish Date - 2023-07-20T12:01:58+05:30 IST

రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు.

Manipur : మణిపూర్‌ మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం సీజే ఆవేదన

న్యూఢిల్లీ : రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదని, మరణ శిక్ష విధించేందుకు సైతం వెనుకాడేది లేదని తెలిపారు.

మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ పరిస్థితిపై మాట్లాడకపోతే, పార్లమెంటులో అంతరాయాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ‘మన్ కీ బాత్ ఇక చాలునని, మణిపూర్ గురించి మాట్లాడవలసిన సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటులో మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తాము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్లపై మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. మోదీకి ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం ఉంది కానీ, మణిపూర్ వెళ్లడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ డెమొక్రసీని మొబొక్రసీగా మార్చిందని మండిపడ్డారు. మణిపూర్‌లో మానవత్వం చచ్చిపోయిందన్నారు. ‘‘నరేంద్ర మోదీ గారూ, మీ మౌనాన్ని ఇండియా ఎన్నటికీ క్షమించదు’’ అని హెచ్చరించారు.

దేశానికి అవమానకరం : మోదీ

మహిళలకు జరిగిన అవమానంపై ప్రధాని మోదీ స్పందించాలని ప్రతిపక్షాలు తీవ్రంగా ఒత్తిడి చేసిన నేపథ్యంలో మోదీ గురువారం ఉదయం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు. ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు అని స్పష్టం చేశారు. ఇది దేశానికి అవమానకరమని చెప్పారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదన్నారు. ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని తూలనాడటమే : సీజేఐ

కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనను సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ (Chief Justice of India DY Chandrachud) ఈ దారుణంపై స్పందిస్తూ, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మతపరమైన ఘర్షణలు చెలరేగే ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని తూలనాడటమేనన్నారు. సామాజిక మాధ్యమాల్లో బయటపడిన వీడియోలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తాము చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తాం : మణిపూర్ సీఎం

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (N Biren Singh) ఇచ్చిన ట్వీట్‌లో, సమాజంలో ఇటువంటి అమానుష చర్యలకు ఎంతమాత్రం చోటు లేదన్నారు. ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడిన వీడియోలో మనసును కలచివేసే దృశ్యాలు కనిపించాయన్నారు. అత్యంత అగౌరవప్రదమైన, అమానుష చర్యలకు గురైన బాధిత మహిళలకు సంఘీభావం తెలిపారు. ఈ వీడియో బయటపడిన వెంటనే మణిపూర్ పోలీసులు తక్షణ చర్యలు ప్రారంభించారని, గురువారం ఉదయం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని, దోషులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దోషులకు మరణ శిక్ష విధించే అంశాన్నికూడా పరిశీలిస్తామన్నారు.

ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బిరేన్‌ సింగ్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. టీఎంసీ

Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..

Updated Date - 2023-07-20T12:32:25+05:30 IST