The Kerala Story : కేరళ స్టోరీ సినిమాపై నిషేధం.. మమత బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

ABN , First Publish Date - 2023-05-18T16:09:26+05:30 IST

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గురువారం నిలిపేసింది. ఈ సినిమాను

The Kerala Story : కేరళ స్టోరీ సినిమాపై నిషేధం.. మమత బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

న్యూఢిల్లీ : ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గురువారం నిలిపేసింది. ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. భావోద్వేగాలు వాక్ స్వాతంత్ర్యాన్ని నిర్దేశించజాలవని స్పష్టం చేసింది. సినిమాలను నిషేధించే సంస్కృతిపై తీవ్రంగా విరుచుకుపడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ ఇచ్చినందువల్ల శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం మే 5న విడుదలైంది. కేరళలో యువతులను ఇస్లాంలోకి మార్చి, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థలకు పంపిస్తున్నట్లు ఈ సినిమా కథనం చెప్తోంది. ఈ సినిమాపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 8న నిషేధం విధించింది. తమిళనాడు ప్రభుత్వం పరోక్షంగా అదే పని చేసింది.

‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిర్మించిన సన్‌షైన్ ప్రొడక్షన్స్ ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శించడం లేదని పిటిషనర్లు తెలిపారు. దీనిపై స్పందించాలని మే 12న ఈ రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సినిమా ప్రదర్శనను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేరళ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

32 వేల మంది యువతులను ఇస్లాంలోకి మార్చినట్లు చెప్పిన విషయంపై ఓ ప్రకటనను మే 20 సాయంత్రం 5 గంటలలోగా ఈ సినిమాలో చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జూలై రెండో వారంలో విచారణ జరుపుతామని తెలిపింది. అయితే ఈ సర్టిఫికేషన్ జారీపై చట్టబద్ధమైన అపీలు ఏదీ దాఖలు కాలేదని ఈ సినిమా నిర్మాత చెప్పారు. సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్‌పై అపీలును విచారించలేమని గతంలో చాలా తీర్పుల్లో చెప్పారని గుర్తు చేశారు.

ఈ సినిమా మూడు రోజులపాటు థియేటర్లలో ప్రదర్శించిన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. తమిళనాడులో భద్రతా కారణాలను చూపుతూ ఎగ్జిబిటర్లు ఈ సినిమా ప్రదర్శనను నిలిపేశారు. గురువారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ, థియేటర్లపై దాడులు జరిగినపుడు, కుర్చీలను తగులబెడుతున్నపుడు తాను మరోవైపు చూస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పజాలదని స్పష్టం చేసింది. ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సినిమా నిర్మాత తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ఏఎం సింఘ్వి, పశ్చిమ బెంగాల్ పోలీసుల తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర నారాయణన్ వాదనలు వినిపించారు.

ఇవి కూడా చదవండి :

Karnataka : కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం సాయంత్రం 7 గంటలకు : డీకే

Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్యకే!

Updated Date - 2023-05-18T16:09:26+05:30 IST