BRICS : బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలకు స్థానం

ABN , First Publish Date - 2023-08-24T14:29:47+05:30 IST

బ్రిక్స్ జట్టులోకి మరో ఆరు దేశాలు చేరబోతున్నాయి. ఈ జట్టును విస్తరించేందుకు ప్రస్తుత సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, భారత దేశం, దక్షిణాఫ్రికా ఏకాభిప్రాయంతో అంగీకరించాయి. సభ్య దేశాల మధ్య సహకారం మరింత పెరగడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేశారు.

BRICS : బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలకు స్థానం
BRICS leaders

జొహన్నెస్‌బర్గ్ : బ్రిక్స్ జట్టులోకి మరో ఆరు దేశాలు చేరబోతున్నాయి. ఈ జట్టును విస్తరించేందుకు ప్రస్తుత సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, భారత దేశం, దక్షిణాఫ్రికా ఏకాభిప్రాయంతో అంగీకరించాయి. సభ్య దేశాల మధ్య సహకారం మరింత పెరగడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేశారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జంటైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలను బ్రిక్స్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందన్నారు. బ్రిక్స్ తొలి దశ విస్తరణ ప్రక్రియపై తామంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశామని చెప్పారు. ఈ ఆరు దేశాలకు బ్రిక్స్‌లో సంపూర్ణ సభ్యత్వం లభిస్తుందన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ఆరు దేశాలను బ్రిక్స్‌లోకి స్వాగతించారు. ఈ దేశాల నేతలను, ప్రజలను అభినందించారు. ఈ దేశాలతో భారత దేశానికి చారిత్రక అనుబంధం ఉందన్నారు. సహకారం, సౌభాగ్యం, అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపించే ఇతర దేశాలను కూడా కలుపుకోవడానికి అన్ని దేశాలతో కలిసి కృషి చేస్తామని తెలిపారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బ్రిక్స్‌లోకి నూతన సభ్య దేశాల ఎంపికపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి భారత్ విశేష కృషి చేసినట్లు తెలిసింది. సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి మోదీ బుధవారం సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : మధ్య తరగతి ప్రజల్లో ఆశలు రేపుతున్న చంద్రయాన్-3 విజయం

Russia : పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ఓ చిల్లర దొంగ!

Updated Date - 2023-08-24T14:29:47+05:30 IST