Parliament : మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-02-07T16:01:16+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని గట్టిగా నిలదీశారు.

Parliament : మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని గట్టిగా నిలదీశారు. పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (Gautam Adani)తో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఒకే ఒక వ్యాపారవేత్త పేరు వినిపించిందని, అది గౌతమ్ అదానీ అని చెప్పారు. మోదీ-అదానీ కలిసి ఉన్న ఓ ఫొటోను లోక్‌సభలో ప్రదర్శించారు.

రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ, తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు తనకు ఒకే ఒక పేరు వినిపించిందన్నారు. ఆ పేరు అదానీ అని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ పేరే వినిపించిందన్నారు. ఎక్కడ చూసినా అదానీ, అదానీ, అదానీ అన్నారు. ‘‘అదానీ ఏ వ్యాపారంలోకి అయినా ప్రవేశిస్తారు. ఆయన ఎన్నడూ విఫలమవరు’’ అని ప్రజలు తనతో చెప్పారన్నారు. ప్రతి వ్యాపారంలోనూ ఆయన ఏ విధంగా విజయం సాధిస్తున్నారు? ఆయన ఎన్నడూ ఎందుకు విఫలమవడం లేదు? ఏమిటి ఆ మాయాజాలం? ఏమిటి ఈ సంబంధం? అని వారు తనను అడిగారన్నారు. మోదీ, అదానీ ఓ విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపించే ఫొటోను ఆయన ప్రదర్శించారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా జోక్యం చేసుకుని, ఇటువంటి పోస్టర్లు సభ గౌరవానికి తగినవి కాదన్నారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ఇది కేవలం ఓ ఫొటో అని, పోస్టర్ కాదని అన్నారు.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విషయంలో రాజకీయాలు చేస్తున్నారని మోదీ ఆరోపించారని, అయితే అదానీకి కాంట్రాక్టులు ఇచ్చారనేది నిజమని చెప్పారు. రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేకపోయినా నాలుగు డిఫెన్స్ కాంట్రాక్టులను అప్పగించారన్నారు. అదానీ ఎన్నడూ డ్రోన్లను తయారు చేయలేదని, హెచ్ఏఎల్ వాటిని తయారు చేసిందని చెప్పారు. అయినప్పటికీ మోదీ ఇజ్రాయెల్ వెళ్లిన తర్వాత, అదానీకి కాంట్రాక్టు దక్కిందని అన్నారు.

ఒకప్పుడు అదానీ విమానంలో మోదీ ప్రయాణించేవారని, ఇప్పుడు మోదీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం అంతకు ముందు గుజరాత్‌కు సంబంధించినదని, ఆ తర్వాత భారత దేశానికి సంబంధించినది అయిందని, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని అన్నారు. గడచిన ఇరవయ్యేళ్ళలో బీజేపీకి అదానీ ఎంత సొమ్ము ఇచ్చారని, ఎలక్టొరల్ బాండ్ల ద్వారా ఎంత ముట్టజెప్పారని నిలదీశారు.

2022లో శ్రీలంక పార్లమెంటరీ కమిటీతో ఆ దేశ విద్యుత్తు బోర్డు చైర్మన్ మాట్లాడుతూ, విండ్ పవర్ ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్స చెప్పినట్లు తెలిపారన్నారు. ఇది భారత దేశ విదేశాంగ విధానం కాదని, ఇది కేవలం అదానీ వ్యాపారం కోసం విధానమని దుయ్యబట్టారు.

ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వెళ్తారని, మాయ చేసినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) అదానీకి 1 బిలియన్ డాలర్లు రుణం ఇస్తుందని అన్నారు. ఆ తర్వాత మోదీ బంగ్లాదేశ్ వెళ్తారని, అదానీతో బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ 25 ఏళ్ళ కాంట్రాక్టు కుదుర్చుకుంటుందని అన్నారు.

అగ్నివీరులపై...

రక్షణ దళాల్లో అగ్నివీరుల నియామక పథకంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ పథకం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆలోచనల నుంచి వచ్చిందని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు తనతో చెప్పారన్నారు. ఆయుధాలను ఉపయోగించడంలో వేలాది మందికి శిక్షణ ఇస్తున్నామని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో వారు సాధారణ పౌరులుగా సమాజంలోకి వస్తున్నారని వారు తనకు చెప్పారన్నారు. ఈ ఆలోచన వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారని కూడా వారు చెప్పారన్నారు. అగ్నివీర్ యోజన గురించి రాష్ట్రపతి ప్రసంగంలో కేవలం ఒకసారి మాత్రమే ఎలా ప్రస్తావించారని నిలదీశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో లేవన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజలు తనకు చెప్పిన సమస్యలేవీ ఈ ప్రసంగంలో కనిపించలేదన్నారు.

Updated Date - 2023-02-07T16:13:23+05:30 IST