Karnataka CM Race : పెదవి కదపని సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2023-05-16T09:57:47+05:30 IST

కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి (Karnataka CM) పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారింది.

Karnataka CM Race : పెదవి కదపని సిద్ధరామయ్య
DK Shiva Kumar, Sidharamaiah

బెంగళూరు : కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి (Karnataka CM) పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ హోరాహోరీగా తలపడుతున్నారు. సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపారు. శివ కుమార్ మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరుతున్నారు. అయితే సిద్ధరామయ్య గుంభనంగా కనిపిస్తున్నారు. ఆయన పెదవి కదపకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించేందుకు సిద్ధరామయ్య (Siddaramaiah) సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలతో చర్చించిన తర్వాత ఆయన మీడియాకు దూరంగా, గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి జరుగుతున్న పోటీలో ఆయనే ముందు వరుసలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

డీకే శివ కుమార్ (DK Shiva Kumar) సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ (DK Suresh) కూడా ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో సోమవారం కలిశారు. అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ, తాను ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఖర్గేను కలుస్తానని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు కూడా కలిశానని చెప్పారు. మిగిలిన విషయాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు తెలియజేస్తారని చెప్పారు. తన సోదరుడు శివ కుమార్ మంగళవారం ఢిల్లీ వస్తారని చెప్పారు.

శివ కుమార్ అనారోగ్య కారణాలను చూపుతూ, సోమవారం చివరి క్షణంలో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడంతో కర్ణాటక సీఎం పదవికి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. సోమవారం ఆయన మాట్లాడుతూ, తన బలం 135 మంది ఎమ్మెల్యేలని చెప్పారు. తన నాయకత్వంలోనే ఈ ఎమ్మెల్యేలంతా గెలిచారని చెప్పారు. తాము ఏక వాక్య తీర్మానం చేశామని చెప్పారు. సీఎం పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయాన్ని పార్టీ హై కమాండ్‌కు వదిలిపెట్టామన్నారు. దీని తర్వాత కొందరు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పి ఉండవచ్చునన్నారు. ఇతరుల బలం గురించి తాను మాట్లాడలేనని, తన బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలని చెప్పారు. తాను నేరుగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని శివ కుమార్ చెప్తున్నారు.

ఇదిలావుండగా, కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశానికి హాజరైన ఆ పార్టీ కేంద్ర పరిశీలకులు తమ నివేదికను పార్టీ అధిష్ఠానానికి అందజేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి :

Amaravati: నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం

Karnataka CM Tussle : కాసేపట్లో ఢిల్లీకి డీకే శివ కుమార్

Updated Date - 2023-05-16T09:57:47+05:30 IST