Jagadish Shettar: ఆయన వల్లే తాను బీజేపీ వీడాల్సి వచ్చిందన్న కర్ణాటక మాజీ సీఎం

ABN , First Publish Date - 2023-04-18T18:22:51+05:30 IST

బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ (Jagadish Shettar) తాజాగా ఆరోపణాస్త్రాలు సంధించారు.

Jagadish Shettar: ఆయన వల్లే తాను బీజేపీ వీడాల్సి వచ్చిందన్న కర్ణాటక మాజీ సీఎం
Jagadish Shettar blames BJP leader B L Santhosh

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ధిక్కార స్వరం వినిపించి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ (Jagadish Shettar) తాజాగా ఆరోపణాస్త్రాలు సంధించారు. తనకు టికెట్ రాకపోవడానికి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BJP leader B L Santhosh) వైఖరి కారణమని శెట్టర్ ఆరోపించారు. బీఎల్ సంతోష్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారని అయితే పార్టీని బలోపేతం చేయలేకపోయారని ఆయన ఆరోపణలు చేశారు. ఎక్కడా సత్తా చాటలేకపోయిన బీఎల్ సంతోష్ కర్ణాటకలో బీజేపీకి నెంబర్ వన్, టూ గా ఉన్నవారిని శాసిస్తున్నారని శెట్టర్ చెప్పారు. విధేయులు కానివారికి బీఎల్ సంతోష్ టికెట్లు ఇప్పించరని కూడా శెట్టర్ ఆరోపించారు.

బీజేపీని వీడే ముందు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (BJP president JP Nadda) ఢిల్లీలో సమావేశమయ్యారు. తన వాదన వినిపించారు. తన పాపులారిటీ బాగుందని, సర్వేల్లో కూడా ఇది స్పష్టమైందన్నారు. తాను ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణమే లేదన్నారు. తాజా ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. హుబ్బళ్లి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శెట్టర్ గత ఎన్నికల్లో 21 వేల ఓట్ల తేడాతో గెలిచిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలిస్తానని నడ్డా హామీ ఇచ్చినా తనకు టికెట్ నిరాకరించారని శెట్టర్ ఇటీవలే చెప్పారు.

224 స్థానాలకుగాను బీజేపీ ఇంతవరకు 222 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పేర్లు కూడా ఉన్నాయి. తొలి జాబితాలో 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. 189 టికెట్లలో 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు ఇచ్చారు. వరుణలో సిద్దూతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్‌.అశోక బరిలోకి దిగనున్నారు. ఇక సీఎం బొమ్మై తన సొంత నియోజకవర్గం శిగ్గావ్‌లో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్‌మగళూర్‌లో, రాష్ట్ర మంత్రి బి.శ్రీరాములు బళ్లారి రూరల్‌లో, గాలి జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీలో బరిలోకి దిగనున్నారు. హిజాబ్‌ వివాదం తలెత్తిన ఉడుపిలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘుపతి భట్‌ స్థానంలో యశ్‌పాల్‌ సువర్ణకు అవకాశమిచ్చారు.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-18T18:22:55+05:30 IST