Delhi liquor policy : నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు : మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2023-02-19T12:37:49+05:30 IST

మనీశ్ సిసోడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి నెలాఖరులో ఎప్పుడైనా తాను సీబీఐ కార్యాలయానికి

Delhi liquor policy : నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు : మనీశ్ సిసోడియా
Manish Sisodia

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం (Delhi liquor policy) కేసులో తనను సీబీఐ (Central Bureau of Investigation) నేడు (ఆదివారం) అరెస్ట్ చేసి ఉండేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) అన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనకు శనివారం ఇచ్చిన నోటీసులో ఆదివారం తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తనను ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని సీబీఐకి ఆయన ఆదివారం ఓ లేఖ రాశారు.

మనీశ్ సిసోడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి నెలాఖరులో ఎప్పుడైనా తాను సీబీఐ కార్యాలయానికి వెళ్ళి, విచారణకు సహకరిస్తానని సిసోడియా చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులో సీబీఐ తనను ఎప్పుడు పిలిచినా తాను హాజరవుతానన్నారు. తాను ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రినని, అందువల్ల బడ్జెట్‌ను తయారు చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. విచారణ తేదీని వాయిదా వేయాలని సీబీఐని కోరినట్లు తెలిపారు. ఈ సంస్థలకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తున్నానని తెలిపారు.

‘‘నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు’’ అని సిసోడియా అన్నారు. తనను అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చునని తాను భావిస్తున్నానని తెలిపారు. ‘‘నేను అరెస్ట్‌కు భయపడేది లేదు, ప్రశ్నల నుంచి పారిపోబోను’’ అని చెప్పారు.

సిసోడియా ఆర్థిక శాఖతో పాటు ఎక్సయిజ్ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఆయనను సీబీఐ గత ఏడాది అక్టోబరు 17న ప్రశ్నించింది. ఆయన ఇల్లు, బ్యాంకు లాకర్లలో తనిఖీలు చేసింది. ఛార్జిషీటులో ఆయనను నిందితునిగా పేర్కొనలేదు. ఆయనతోపాటు మరికొందరు నిందితులపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని, దీనిపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫారసు చేశారు. అనంతరం సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ విధానాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించింది. సీబీఐ గత ఏడాది నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సిసోడియా, మరో 14 మంది పేర్లు ఉన్నాయి. వీరు నేరపూరిత కుట్ర, రికార్డుల తారుమారు, అవినీతి వంటివాటికి వీరు పాల్పడినట్లు ఆరోపించింది. ఈ కేసులో సీబీఐ మూడు నెలల క్రితం స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. సిసోడియాకు మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Delhi liquor policy : సీబీఐకి మనీశ్ సిసోడియా లేఖ

Baheswar Dham : ధీరేంద్ర శాస్త్రికి ముస్లిం మత పెద్దల షాక్

Updated Date - 2023-02-19T12:37:58+05:30 IST