Summit For Democracy : దేశంలో ప్రజాస్వామ్యంపై కుండ బద్దలు కొట్టిన మోదీ

ABN , First Publish Date - 2023-03-29T19:57:13+05:30 IST

ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ, ‘‘ప్రజల ప్రథమ కర్తవ్యం తమ నేతను ఎన్నుకోవడమని మా ప్రాచీన ఇతిహాసం మహాభారతంలో వర్ణించారు.

Summit For Democracy : దేశంలో ప్రజాస్వామ్యంపై కుండ బద్దలు కొట్టిన మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి తల్లి భారత దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారత దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చెప్పారు. దీనినిబట్టి ప్రజాస్వామ్యం వల్ల మేలు జరుగుతుందని, ప్రజాస్వామ్యం మనకు ఎంతో ఇవ్వగలదని స్పష్టమవుతోందన్నారు. బుధవారం జరిగిన ‘ప్రజాస్వామ్యం కోసం సదస్సు’ (Summit For Democracy)లో ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడారు. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యివోల్ ఈ సదస్సును నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కోస్టారికా ప్రెసిడెంట్ రోడ్రిగో చావేజ్ రోబుల్స్, జాంబియా ప్రెసిడెంట్ హకైన్డే హిచిలెమా, నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే కో-హోస్ట్‌లుగా వ్యవహరించారు.

ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ, ‘‘ప్రజల ప్రథమ కర్తవ్యం తమ నేతను ఎన్నుకోవడమని మా ప్రాచీన ఇతిహాసం మహాభారతంలో వర్ణించారు. విస్తృత సంప్రదింపుల ప్రాతిపదికగల వ్యవస్థల ద్వారా రాజకీయ అధికారాన్ని వినియోగించడం గురించి పవిత్రమైన వేదాలు చెప్తున్నాయి. ప్రాచీన భారత దేశంలో గణతంత్ర రాజ్యాల గురించి చరిత్రలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. పాలకులు వారసత్వం ద్వారా వచ్చినవారు కాదు. వాస్తవానికి భారత దేశం ప్రజాస్వామ్యం యొక్క తల్లి’’ అని చెప్పారు.

ప్రజాస్వామ్యం అనేది ఓ అస్థిపంజరం వంటి నిర్మాణం కాదని, అది ఆత్మ, ప్రాణం, జీవం అని తెలిపారు. ప్రతి మానవుడి అవసరాలు, ఆకాంక్షలకు సమాన ప్రాధాన్యం ఉంటుందనే విశ్వాసంపై ఇది ఆధారపడి ఉందని తెలిపారు. ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి అనేది భారత దేశంలో మాకు మార్గదర్శకంగా నిలిచే సిద్ధాంతం’’ అని తెలిపారు. జీవన శైలి మార్పుల ద్వారా వాతావరణ మార్పు కోసం మేము చేసే పోరాటమైనా, వేర్వేరు చోట్ల నిల్వ చేయడం ద్వారా నీటి పరిరక్షణ కోసం చేసే కృషి అయినా, వంట చేసుకునేందుకు ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన ఇంధనాన్ని అందజేయడమైనా, ప్రతి పనిలోనూ భారతీయుల ఉమ్మడి కృషి ఉంటుందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల నాయకత్వంలోనే భారత దేశం స్పందించిందని తెలిపారు. భారత దేశంలోనే తయారు చేసిన 200 కోట్ల టీకా మోతాదుల (Vaccine Doses)ను ప్రజలకు విజయవంతంగా ఇవ్వగలగడానికి కారణం ప్రజలేనని, దీనిని సుసాధ్యం చేసినవారు ప్రజలేనని తెలిపారు. ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలో అనేక దేశాలకు మిలియన్ల డోసుల వ్యాక్సిన్లను అందజేసినట్లు తెలిపారు. దీనికి కూడా మార్గదర్శనం చేసినది వసుధైక కుటుంబం అనే ప్రజాస్వామిక స్ఫూర్తేనని చెప్పారు. ‘ఒక భూమి, ఒకే కుటుంబం (భూమిపైగల ప్రజలంతా ఒకే కుటుంబం), ఒకే భవిష్యత్తు’ అనేది వసుధైక కుటుంబం ఉద్దేశమని వివరించారు.

ప్రజాస్వామ్యం యొక్క సుగుణాల గురించి చెప్పాలంటే చాలా ఉందని, అయితే అనేక అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, నేడు భారత దేశం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఇది అత్యుత్తమమైన ప్రకటన (Advertisement) అని తెలిపారు. ప్రజాస్వామ్యం కాపాడుతుందని, అవసరమైనవాటిని అందజేస్తుందని ఇది స్పష్టం చేస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!

UPI Transactions : డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలా? అమ్మో!

Updated Date - 2023-03-29T19:57:13+05:30 IST