India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!

ABN , First Publish Date - 2023-03-29T15:00:04+05:30 IST

షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation-SCO) సభ్య దేశాలు ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని

India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!
Ajit Doval , SCO Meet

న్యూఢిల్లీ : షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation-SCO) సభ్య దేశాలు ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని భారత దేశం గట్టిగా చెప్పింది. పొరుగు ప్రాంతాలపై ఏకపక్షంగా సైనిక ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకోకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో చైనా పాల్పడుతున్న దుశ్చర్యలను ఈ విధంగా పరోక్షంగా ఎండగట్టింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఎస్‌సీఓ ఉన్నత స్థాయి భద్రతాధికారులు పాల్గొన్నారు.

భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) ఎస్‌సీఓ సమావేశంలో బుధవారం మాట్లాడుతూ, ఈ సంఘం సభ్య దేశాలు ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని చెప్పారు. పొరుగు ప్రాంతాల్లో ఏకపక్షంగా సైనిక ఆధిపత్యాన్ని కోరుకోకూడదని స్పష్టం చేశారు. ప్రాంతీయ అనుసంధానం అవసరం ఉందని, అయితే అటువంటి చర్యలు పారదర్శకంగా ఉండాలని, అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని చెప్పారు. అంతర్జాతీయ భద్రతా సవాళ్ల ప్రభావం ఈ ప్రాంతంపై పడిందన్నారు. ఎస్‌సీఓ చార్టర్ లక్ష్యాలు, దార్శనికత సభ్య దేశాల ముందు ఉన్న మార్గాన్ని చూపిస్తున్నట్లు తెలిపారు. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను పరస్పరం గౌరవించుకోవాలని ఎస్‌సీఓ చార్టర్ చెప్తోందన్నారు. దేశాల సరిహద్దులను ఉల్లంఘించరాదని, అంతర్జాతీయ సంబంధాల్లో బల ప్రయోగం చేయరాదని, ఆ విధంగా బెదిరించరాదని చెప్తోందని తెలిపారు. పొరుగు ప్రాంతాల్లో ఏకపక్షంగా సైనిక ఆధిపత్యాన్ని కోరుకోకూడదని చెప్తోందన్నారు. అయితే ఆయన చైనాను ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో దోవల్ మాట్లాడుతూ, ఇతర దేశాలతో సంబంధాలను కొనసాగించాలని సభ్య దేశాలకు ఈ చార్టర్ చెప్తోందన్నారు. అంతర్జాతీయ సంఘర్షణలను నిరోధించడంలో, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో సహకరించాలని చెప్తోందని తెలిపారు.

చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవ (China-Pakistan Economic Corridor-CPEC)ను భారత దేశం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దోవల్ వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ నడవ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు గుండా వెళ్తున్న సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ నికోలాయ్ పట్రుషేవ్, కజఖ్‌స్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. చైనా, పాకిస్థాన్ అధికారులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Karnataka Assembly Elections: 80 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటింగ్

DK Shivakumar: మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. డీకే రియాక్షన్

Updated Date - 2023-03-29T15:00:04+05:30 IST