DK Shivakumar: మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. డీకే రియాక్షన్

ABN , First Publish Date - 2023-03-29T13:47:56+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు...

DK Shivakumar: మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. డీకే రియాక్షన్

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly polls)కు తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar)తెలిపారు. మే 10వ తేదీన ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) బుధవారంనాడు ఢిల్లీలో ప్రకటించారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. సీఈసీ ప్రకటనతో ఎన్నికల కోడ్ వెంటనే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది.

ప్రభుత్వాన్ని రద్దు చేయాలి...

కాగా, ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఎంత తర్వగా ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తే అంత త్వరగా రాష్ట్రానికి, దేశానికి మంచిదని అన్నారు. అభివృద్ధి ప్రాతిపదికగా, అవినీతి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని విముక్తి చేయడానికి ఉద్దేశించిన ఎన్నికలుగా అసెంబ్లీ ఎన్నికలను ఆయన అభివర్ణించారు. అవినీతి పరాకాష్టకు చేరిందని, ప్రధానమంత్రి మోదీ దీనిని ప్రోత్సహిస్తున్నారని, సొంత పార్టీ నేతలపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని డీకే విమర్శించారు.

డీకేపై సీఎం విసుర్లు

కాగా, అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ (బీజేపీ), ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. తిరిగి తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ర్యాలీలో ప్రజలపై ఆయన రూ.500 నోట్లు విసురుతూ కనిపించడంపై స్పందిస్తూ, ప్రజలను ప్రలోభ పెట్టేందుకు అన్నిరకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు బిచ్చగాళ్లని కాంగ్రెస్ అనుకుంటోందని, ప్రజలే నిజమైన యజమానులని అన్నారు.

Updated Date - 2023-03-29T13:54:52+05:30 IST