New Parliment inauguration: పార్లమెంటు ప్రారంభోత్సవానికి ముహూర్తం బాగోలేదు.. తేదీ, సమయం ఎవరు నిర్ణయించారో గానీ...

ABN , First Publish Date - 2023-05-24T16:59:29+05:30 IST

ఈనెల 28వ తేదీన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తాజాగా, దీనికి ముహూర్త దోషం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కొందరు దీనితో ఏకీభవిస్తుంటే, మరికొందరు అలాంటిదేమీ లేదంటూ భిన్నాభిప్రాయులు వ్యక్తం చేస్తున్నారు.

New Parliment inauguration: పార్లమెంటు ప్రారంభోత్సవానికి ముహూర్తం బాగోలేదు.. తేదీ, సమయం ఎవరు నిర్ణయించారో గానీ...

న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి నూతన పార్లమెంటు భవనం (New Parliament) తలమానికమని, ప్రపంచ దేశాలకు మన ప్రజాస్వామ్య సత్తాను చాటే కార్యక్రమమే నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవమని కేంద్రం ఓవైపు చెబుతుండగా, మరోవైపు రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ఏమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి. పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఎలాంటి విలువా లేదని తెగేసి చెబుతూ 19 విపక్ష పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు సంయుక్త ప్రకటన సైతం విడుదల చేశాయి. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమంపై ఎందుకు ఇంత చర్చ జరుగుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా, ముహూర్త దోషం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కొందరు దీనితో ఏకీభవిస్తుంటే, మరికొందరు అలాంటిదేమీ లేదంటూ భిన్నాభిప్రాయులు వ్యక్తం చేస్తున్నారు.

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసింది. ఈనెల 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లోని నూతన పార్లమెంటు భవనాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఆహ్వాన పత్రిక విడుదల చేశారు. ఈ పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక (ఆస్ట్రాలజీ గైడెన్స్) అనే ట్విటర్ యూజర్‌ ముహూర్తంపై ఆసక్తికరంగా స్పందించారు.

''ఎవరితో సంప్రదించి ఈ ముహూర్తం నిర్ణయించారో కానీ ఎంచుకున్న సమయం అస్సలు బాలేదు. పైపైన విశ్లేషించి నిర్ణయించినట్టు కనిపిస్తోంది'' అని ప్రియాంక అభిప్రాయపడ్డారు. ఎంచుకున్న తేదీన ఎంచుకున్న సమయం మాత్రం ఏమాత్రం బాగోలేదని, ముఖ్యంగా ప్రారంభోత్సవాలకు సంబంధించిన ఈ ముహూర్తం బాగాలేదని అన్నారు. దేశం, భవిష్యత్‌ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ ముహూర్తాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించాలని ఆమె సూచించారు. ముహూర్త జ్యోతిష్యం బాగా తెలిసిన వారికి ఎంపిక చేసిన సమయంపై ఒక నిర్ణయానికి రావడానికి పెద్ద సమయం పట్టదని అన్నారు. నిశ్చయించిన సమయం (మధ్యాహ్నం 12 గంటలు) కంటే 11.25 నుంచి 11.50 గంటల వరకు కొంచెం బెటర్‌గా ఉంటుందని ప్రియాంక తన ట్వీట్‌లో సూచించారు.

కాగా, ప్రియాంక ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సొంత జ్యోతిష్యుడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినట్టున్నారని ఒక ట్విట్టరాటీ పోస్ట్ చేశారు. అయితే, ఇది ప్రారంభోత్సవ సమయం కాదని, ప్రజలను ఆహ్వానించిన సమయమని మరొకరు ట్వీట్ చేశారు. దీనికి ముందే హోమం, యజ్ఞం వంటివి ఉంటాయని, అదే నిజమైన ప్రారంభోత్సవ సమయం అవుతుందని ఆయన అన్నారు. మోదీ, అమిత్‌షాలకు జ్యోతిషం బాగా తెలుసునని, ఆమె (ప్రియాంక) పనితీరు మాత్రం ఎవరికీ తెలియదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటిపై ప్రియాకం మరోసారి స్పందిస్తూ, అనూకూలమైన ముహూర్తం ఎంపిక చేసుకోవడం, లేదా మూహూర్తం జారవిడుచుకోవడం వంటివి భగవంతుడి నిర్ణయంపైనే ఉంటుందని, ఎంచుకున్న సమయం వల్ల ఏర్పడే పరిణామాలు భవిష్యత్తులో తేలుతాయని అన్నారు. దీనిపై మరో ట్విట్టరాటీ స్పందిస్తూ, ముహూర్తాలు నిశ్చయమవుతాయని, ఎంచుకోలేమని, ప్రపంచంలో ఎవరూ ముహూర్తం ఎంపిక విషయంలో చిక్కులు కోరుకోరని అన్నారు. ముహూర్తాలు మార్చకూడదని, శ్రీహరి లీల అనేది ఒకటి ముందే నిర్ణయమై ఉంటుందని అన్నారు. కాగా, తాను స్వయంగా ఈ ముహూర్తాన్ని సూచించానని, మోదీకి ట్యాగ్ కూడా చేశానని ఆస్ట్రో కౌన్సిల్ ఐకేకే ఒక ట్వీట్‌లో తెలిపారు.మరోసారి సమీక్షించనవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-05-24T17:20:54+05:30 IST