Share News

Congress: కాంగ్రెస్‏లో కలకలం రేపుతున్న ‘విందు’ రాజకీయం

ABN , First Publish Date - 2023-10-29T12:33:30+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది. అందరూ కలసి ఉన్నామని అగ్రనేతలు తరచూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నా

Congress: కాంగ్రెస్‏లో కలకలం రేపుతున్న ‘విందు’ రాజకీయం

- పరమేశ్వర్‌ నివాసంలో విందుకు సీఎం, మంత్రులు హాజరు

- ఉపముఖ్యమంత్రి రాకపోవడంపై సర్వత్రా చర్చ

- ఎమ్మెల్యేలతో దుబాయ్‌ పర్యటనకు సతీశ్‌ జార్కిహొళి సిద్ధం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది. అందరూ కలసి ఉన్నామని అగ్రనేతలు తరచూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నా అంతర్గతంగా మాత్రం పార్టీలో అగాథం పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా మరోసారి ముఖ్యమంత్రి పదవి రెండున్నరేళ్లు మాత్రమే అనే అంశం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే రవికుమార్‌ గణిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అందుకు వీడియోలు ఉన్నాయని, అవసరమైనప్పుడు విడుదల చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు డీకే శివకుమార్‌ వెంట 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఓ ఎమ్మెల్యే గతంలో ప్రకటించారు. తాజాగా శనివారం సహకారశాఖ మంత్రి రాజణ్ణ ఎవరెన్ని ప్రకటనలు చేసినా ఐదేళ్లు సీఎంగా సిద్దరామయ్య ఉంటారని, ఇందులో మార్పు ఉండదని పేర్కొన్నారు. సీఎం మార్పు విషయం అధిష్టానానికి సంబంధించినదని, ఎవరూ వ్యాఖ్యానించరాదని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరికివారుగా అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇలా సాగుతుండగా హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌ నివాసంలో శుక్రవారం రాత్రి జరిగిన విందు మరో చర్చకు దారి తీసింది. పరమేశ్వర్‌ నివాసం సదాశివనగర్‌లో ఉంది. ఇక్కడికి సమీపంలోనే ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) ఇల్లు కూడా ఉంది. అయితే డీసీఎం లేకుండా పరమేశ్వర్‌ ఇంట విందుకు సీఎం సిద్దరామయ్య, మంత్రులు సతీశ్‌ జార్కిహొళి, హెచ్‌సీ మహదేవప్ప హాజరయ్యారు. మహదేవప్ప, సీఎంకు ఆప్తుడనేది తెలిసిందే. సతీశ్‌ జార్కిహొళి కూడా సిద్దరామయ్య వర్గానికి చెందినవారే. బెళగావి రాజకీయాల్లో డీసీఎం జోక్యం పెరిగిందని సతీశ్‌ జార్కిహొళి ఇటీవల బహిరంగంగా విమర్శించారు. బెళగావి నుంచి పలువురు ఎమ్మెల్యేలతో ఆయన మైసూరు ఉత్సవాల సందర్శనకు ప్రయత్నించగా అధిష్టానం బ్రేక్‌ పెట్టిన విషయం తెలిసిందే. అప్పటితో యాత్రను రద్దు చేసుకున్న సతీశ్‌ జార్కిహొళి ఇది తాత్కాలికమేనని, త్వరలోనే యాత్ర ఉంటుందని ప్రకటించారు.

pandu1.jpg

ఇదే సందర్భంలో బెళగావి జిల్లాలో ఓ నేత జోక్యం పెరిగిందని, ఒకరి ద్వారానే పార్టీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో డీసీఎం డీకే శివకుమార్‌కు మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ వత్తాసు పలకగా సతీశ్‌ జార్కిహొళి తీవ్రంగానే ప్రతిఘటించారు. ఇలా సాగుతుండగానే మరోవారంలో దుబాయ్‌ పర్యటనకు వెళ్తున్నామని మంత్రి సతీశ్‌ జార్కిహొళి ప్రకటించారు. ఎమ్మెల్యేలతో కలసి వెళ్తున్నామని, ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ యాత్రను అడ్డుకునే ప్రయత్నం ఏ కోశాన జరిగినా పార్టీలో విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. కాగా ఐదు నెలలుగా బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష, ఉపాధ్యక్షుల భర్తీకి సంబంధించి ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే పదవి కీలకమని, అటువంటిది అదనంగా వారికి బోర్డులు, కార్పొరేషన్లు ఎందుకంటూ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శించారు. అయినా మంత్రి పదవులు దక్కని పలువురిని బుజ్జగించేందుకు సీఎం, డీసీఎం పలువురికి హామీలు ఇచ్చారు. అందుకు అనుగుణంగానే 20 మంది ఎమ్మెల్యేలకు బోర్డులు, కార్పొరేషన్‌లలో చోటు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై అధిష్టానం స్పందించకపోతే విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ చర్చలు లేవు : పరమేశ్వర్‌

ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలసి విందుకు మంత్రులు హాజరయ్యారని, ఇందులో ఎటువంటి రాజకీయ చర్చలు లేవని హోం మంత్రి పరమేశ్వర్‌ వెల్లడించారు. స్నేహపూర్వకంగా మాత్రమే భేటీ జరిగిందన్నారు.

Updated Date - 2023-10-29T12:33:30+05:30 IST