Delhi Liquor Scam Case: మూడోసారి ఈడీ విచారణకు కవిత వెళ్తారా?

ABN , First Publish Date - 2023-03-20T23:46:35+05:30 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం (మార్చి 21న) ఉదయం 11:30 గంటలకు మూడోసారి ఈడీ(ED) విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

Delhi Liquor Scam Case: మూడోసారి ఈడీ విచారణకు కవిత వెళ్తారా?
Delhi Liquor Scam Case

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) మంగళవారం (మార్చి 21న) ఉదయం 11:30 గంటలకు మూడోసారి ఈడీ(ED) విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే ఆమె రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 11న అలాగే ఇవాళ కూడా ఆమె ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. దాదాపు పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు ఆమెను విచారించారు. విచారణ ముగిసి బయటకు వచ్చాక ఆమె హుషారుగా విక్టరీ సింబల్ చూపుతూ కారెక్కారు. చిరునవ్వులు చిందిస్తూ ఢిల్లీలోని తన తండ్రి కేసీఆర్ నివాసానికి ఆమె చేరుకున్నారు. అయితే మంగళవారం (మార్చి 21న) ఉదయం 11:30 గంటలకు మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన తరుణంలో ఆమె హాజరౌతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

కవితను ఇవాళ మొత్తం 20 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఉదయం కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సాయంత్రం సమయంలో కవితను ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి ప్రశ్నించారు.

కవిత విచారణ సమయంలో ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు.

Updated Date - 2023-03-20T23:46:35+05:30 IST