Delhi Liquor Scam case: కవిత విచారణలో ఉండగానే.. అడ్వకేట్‌ సోమ భరత్‌కు ఈడీ పిలుపు..

ABN , First Publish Date - 2023-03-21T20:01:04+05:30 IST

కొన్ని డాక్యుమెంట్లు అవసరం కావడంతో కవిత అడ్వకేట్‌ సోమ భరత్‌కు ఈడీ అధికారులు కబురుపంపారు.

 Delhi Liquor Scam case: కవిత విచారణలో ఉండగానే.. అడ్వకేట్‌ సోమ భరత్‌కు ఈడీ పిలుపు..
BRS MLC Kavitha

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED) అధికారులు 8గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి కవితను ప్రశ్నిస్తున్నారు. విచారణ సమయంలో కీలక పత్రాలు కొన్ని డాక్యుమెంట్లు అవసరం కావడంతో కవిత అడ్వకేట్‌ సోమ భరత్‌కు ఈడీ అధికారులు కబురుపంపారు. ఆయన కొన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఈడీ అధికారులకు ఇచ్చారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలోని మూడో అంతస్థులో కవిత విచారణ కొనసాగుతోంది. కవిత కుటుంబ సభ్యులకు కూడా ఈడీ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కవిత ఈ నెల 11న తొలిసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 20న రెండోసారి హాజరయ్యారు. ఇవాళ కవితను వరుసగా రెండోరోజు విచారిస్తున్నారు. నిన్న కూడా కవితను పదిన్నర గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం 14 ప్రశ్నలు కవితకు సంధించినట్లు సమాచారం.

కవితను నేడు అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.

కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినాయకత్వం హస్తిన పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ఎంపీ సంతోష్ సహా అనేకమంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఈడీ కార్యాలయం చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు.

Updated Date - 2023-03-21T20:06:00+05:30 IST