George Soros : జార్జి సొరోస్‌తో కాంగ్రెస్‌కు అనుబంధం : బీజేపీ

ABN , First Publish Date - 2023-02-18T18:09:08+05:30 IST

భారత దేశ ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేసిన అమెరికన్ బిలియనీర్ జార్జ్ సొరోస్‌‌తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీని

George Soros : జార్జి సొరోస్‌తో కాంగ్రెస్‌కు అనుబంధం : బీజేపీ
Rahul Gandhi , Salil Shetty

న్యూఢిల్లీ : భారత దేశ ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేసిన అమెరికన్ బిలియనీర్ జార్జ్ సొరోస్‌‌తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీని బీజేపీ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bhyarat Jodo Yatra)లో సలీల్ షెట్టి పాల్గొన్నారని, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా షెట్టి వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఈ ఫౌండేషన్స్‌కు జార్జి సొరోస్ ఆర్థికంగా మద్దతిస్తున్నారని పేర్కొంది.

జార్జి సొరోస్ ఇటీవల మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అదానీ గ్రూప్‌ (Adani Group)పై వచ్చిన ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మౌనంగా ఉన్నారన్నారు. పార్లమెంటులోనూ, విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చే ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. భారత దేశ కేంద్ర ప్రభుత్వంపై ఆయన పట్టును ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో బలహీనపరుస్తుందన్నారు. ఎంతో అవసరమైన సంస్థాగత సంస్కరణలకు తలుపులు తెరుస్తుందన్నారు. తాను కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, భారత దేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవం జరుగుతుందని భావిస్తున్నానని తెలిపారు.

సొరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శుక్రవారం స్పందిస్తూ, భారత దేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవానికి అదానీ అంశం కారణమవుతుందా? లేదా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల ప్రక్రియలపై ఆధారపడి ఉంటుందని, అంతేకానీ సొరోస్‌కు దీనితో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.

ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మాట్లాడుతూ, సొరోస్ వంటివారు తాము కోరుకున్న వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే, ఆ ఎన్నికలు మంచివని భావిస్తారని, అదే ఎన్నికల ఫలితం వేరొక విధంగా ఉంటే, అది లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యమని అంటారని ఎద్దేవా చేశారు. అరమరికలు లేని సమాజానికి మద్దతిస్తున్నామనే ముసుగులో ఇదంతా జరుగుతుందన్నారు.

నిలదీసిన బీజేపీ

బీజేపీ నేతలు గౌరవ్ భాటియా, షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్లలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి సలీల్ షెట్టి నడుస్తున్నట్లు కనిపిస్తున్న ఫొటోను షేర్ చేశారు. జార్జి సొరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న బంధుత్వం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా షెట్టి పాల్గొన్నారని తెలిపారు. అంతేకాకుండా షెట్టి ప్ఫైజర్, మొడెర్నా వ్యాక్సిన్లను వాడాలని వాదించారని తెలిపారు. ఈ వివరాలన్నీ ఆయన పాత ట్వీట్లను చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.

గౌరవ్ భాటియా ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశానికి వ్యతిరేకంగా జార్జి సొరోస్ చేసే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత దేశం సమైక్యంగా నిలిచిందన్నారు. ఇలాంటి దుర్బల పిగ్మీలతో వ్యవహరించే సత్తా ఓ జాతిగా తమకు ఉందన్నారు. సొరోస్ సహాయకుడు సలీల్ షెట్టి ఓ ప్రభుత్వేతర సంస్థ (NGO)కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఈ ఎన్జీవోకు సొరోస్ ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు. షెట్టి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారని పేర్కొన్నారు.

షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్‌లో, జైరామ్ రమేశ్ గారూ, ఈ బంధం ఏమని చెప్తోంది? అని ప్రశ్నించారు. మొదట ప్రవీణ్, ఇప్పుడు సలీల్ షెట్టి అన్నారు. కాంగ్రెస్, సొరోస్ కలిసి మెలిసి ఉన్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ చేయి, జార్జి సొరోస్‌తో చెట్టాపట్టాలు వేసుకుందా? అని అడిగారు. జైరామ్ గారూ ఇది ‘‘మనం మనం కలిసి ఉన్నాం’’ అనేనా? అని ప్రశ్నించారు.

పి చిదంబరం స్పందన

ఇదిలావుండగా, కాంగ్రెస్ నేత పి చిదంబరం శనివారం స్పందిస్తూ, తాను జార్జి సొరోస్ వ్యాఖ్యలతో ఏకీభవించబోనని తెలిపారు. అయితే భారత దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ప్రయత్నంగా ఆయన వ్యాఖ్యలను పేర్కొనడం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉండాలో, ఎవరు బయటకు పోవాలో భారత దేశ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 92 ఏళ్ళ విదేశీ సంపన్నుడు యథాలాపంగా ఇచ్చిన స్టేట్‌మెంట్ ద్వారా కూలిపోయే స్థితిలో మోదీ ప్రభుత్వం ఉన్నట్లు తనకు తెలియదని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

North Korea : జపాన్‌లోకి దూసుకెళ్లిన ఉత్తర కొరియా క్షిపణి

George Soros Vs India : జార్జి సొరోస్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

Updated Date - 2023-02-18T18:21:04+05:30 IST