Karnataka Assembly Polls: కిచ్చా సుదీప్ నిర్ణయంపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-04-05T18:59:13+05:30 IST

కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.

Karnataka Assembly Polls: కిచ్చా సుదీప్ నిర్ణయంపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే?
Prakash Raj on Kichcha Sudeep extending his support to BJP

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల (Karnataka Assembly Polls) వేళ భారతీయ జనతా పార్టీకి (BJP) కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ (Kannada actor Kichcha Sudeep) మద్దతు ప్రకటించడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Prakash Raj) స్పందించారు. సుదీప్ నిర్ణయంతో తాను షాకయ్యానని చెప్పారు. తాను హర్ట్ అయ్యానన్నారు. ప్రకాశ్ రాజ్ స్వస్థలం కర్ణాటక. ప్రస్తుతం ఆయన దక్షిణాది భాషల్లోనూ, హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతుదారుగా ఉన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ప్రకాశ్‌రాజ్‌కు పేరుంది.

కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కిచ్చా సుదీప్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడంపై స్పందించారు. బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందని, అయితే ఆరున్నర కోట్ల కన్నడ సోదరసోదరీమణులే ఎన్నికలను ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా(Congress MP Randeep Surjewala) వ్యాఖ్యానించారు. ఎన్నికలను సినిమా వాళ్లు ప్రభావితం చేయలేరని చెప్పారు. సుర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva Kumar) అక్కడే ఉన్నారు. గతంలో డీకే కిచ్చా సుదీప్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా యత్నించారు.

అంతకు ముందు కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని కిచ్చా సుదీప్ ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో(Karnataka CM Basavaraj Bommai) కలిసి బెంగళూరులో విలేకరుల సమావేశంలో పాల్గొన్న సుదీప్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. బొమ్మైతో తనకున్న అనుబంధంతోటే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని, కేవలం బీజేపీకి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడానికే వచ్చానన్నారు. బీజేపీ సిద్ధాంతం తనకు నచ్చుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ నటుడు కిచ్చా సుదీప్‌ మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని చెప్పారు. పూర్తి మెజార్టీతో తాము మరోసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారుకు (double engine government) ప్రజలు బీజేపీకే పట్టం కడతారని బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తనకు, బీజేపీకి మద్దతిచ్చిన కిచ్చా సుదీప్‌కు ధన్యవాదాలు తెలిపారు.

పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగిస్తున్న వేళ కిచ్చా సుదీప్ తమకు మద్దతు కలిసి వస్తుందని బీజేపీ నేతలు ఆశాభావంగా ఉన్నారు.

హీరోగా సుదీప్ నటించిన కన్నడ, తెలుగు, హిందీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కిచ్చా, నాంది, స్పర్శ తదితర సినిమాలు తీశారు. దర్శకుడిగా మై ఆటోగ్రాఫ్ సినిమా తీశారు. కెంపెగౌడ, మాణిక్య తదితర హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ఈగ సినిమాలో సుదీప్ విలన్‌గా నటించారు. సుదీప్ బుల్లితెరపైన కూడా మెరుస్తున్నారు. అనేక రియాల్టీ షోలకు హోస్ట్‌గా ఉన్నారు.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-05T19:43:57+05:30 IST