Share News

Israel-Hamas: లెబనాన్‌ హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు

ABN , First Publish Date - 2023-10-17T16:10:46+05:30 IST

లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు చెందిన లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం గత రాత్రి వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

Israel-Hamas: లెబనాన్‌ హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు

లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు చెందిన లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం గత రాత్రి వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘లెబనీస్ భూభాగంలో ఉగ్రవాద సంస్థ హిజ్‌బొల్లా సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేస్తోంది.’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌కు అనుకూలమైన లెబనీస్ గ్రూప్ హిజ్‌బొల్లా.. హమాస్‌కు మిత్రపక్షంగా కూడా ఉంది. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో లెబనీస్ గ్రూప్ హిజ్‌బొల్లా, హమాస్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైమానిక దాడుల తర్వాత ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులోని కనీసం 28 ప్రాంతాల నుంచి వేలాది మంది ఖాళీ చేయడం ప్రారంభించారు. లెబనాన్ నుంచి కొంత కాలంగా తరచూ దాడులు జరుగుతుండడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజకీయ, సైనిక, సామాజిక రంగాల్లో లెబనాన్ హెజ్‌బొల్లా బలంగా ఉంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో లెబనాన్.. హమాస్‌కు మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ సైనిక పోస్టులపై, ట్యాంక్‌లపై దాడులకు పాల్పడుతోంది. దీంతో లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ గత రాత్రి వైమానిక దాడులు చేసింది. అంతేకాకుండా సరిహద్దుల్లో హెజ్‌బొల్లా చేపట్టిన శతఘ్ని దాడులను కూడా ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొట్టింది.


మరోవైపు పాలస్తీనా గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో యుద్ధంలో మరణ మృదంగం మార్మోగుతోంది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రజల నివాసాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వైమానిక దాడులతో పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లు నెలకూలాయి. ఈ యుద్ధంలో మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. రెండు వైపుల నుంచి ఇప్పటివరకు ఏకంగా 4 వేలకు చనిపోయారు. హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన 1,300 మంది చనిపోయారు. దీంతో ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయడంతో 2,670 మందికి పైగా చనిపోయారు. మరో 10,000 మంది గాయపడ్డారని గాజా అధికారులు తెలిపారు. మరో 1,000 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నారు.

Updated Date - 2023-10-17T16:10:46+05:30 IST