Share News

US Strikes: సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి.. దాడులకు కారణమేంటంటే..?

ABN , First Publish Date - 2023-11-09T11:13:21+05:30 IST

తూర్పు సిరియాలోని ఇరాన్‌‌కు మద్దతిస్తున్న సాయుధ బలగాలపై యూఎస్ యుద్ధ విమానాలు బుధవారం దాడులు చేశాయి. సిరియాలో అమెరికా యుద్ధ విమానాలు దాడి చేయడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఈ విషయాన్ని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. అయితే ఈ దాడుల్లో 9 మంది చనిపోయినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ వెల్లడించారు.

US Strikes: సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి.. దాడులకు కారణమేంటంటే..?

తూర్పు సిరియాలోని ఇరాన్‌‌కు మద్దతిస్తున్న సాయుధ బలగాలపై యూఎస్ యుద్ధ విమానాలు బుధవారం దాడులు చేశాయి. సిరియాలో అమెరికా యుద్ధ విమానాలు దాడి చేయడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఈ విషయాన్ని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. అయితే ఈ దాడుల్లో 9 మంది చనిపోయినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ వెల్లడించారు. ఇరాక్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతున్న సాయుధ బలగాలు ఇటీవల దాడులు చేశాయి. రోజుల వ్యవధిలోనే ఏకంగా 12 సార్లు దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ బలగాలపై అమెరికా దాడులు చేసింది. కాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రాంతీయ యుద్ధంగా మారకుండా ఉండేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ దానికి మద్దతిస్తున్న వాటిని అరికట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.


దీంతో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఈ దాడులకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఇస్టిన్ తెలిపారు. కానీ పశ్చిమాసియాలోని అమెరికా దళాలపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం సహించబోమని తెలిపేందుకే అమెరికా ఈ దాడులు చేసినట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా అమెరికాపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ఉందని ఆయన ఆరోపించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, దాని అనుబంధ గ్రూపులు ఉపయోగించే తూర్పు సిరియాలోని ఓ సౌకర్యంపై యూఎస్ సైనిక దళాలు ఆత్మరక్షణ దాడులు చేశాయని చెప్పారు. రెండు యూఎస్ ఎఫ్-15లు ఈ దాడులు చేసినట్టు ఆస్టిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇస్లామిక్ రాజ్యాల వర్గాలను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్‌లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికా సైనికులున్నారు. వీరిపైపూ ఇటీవల ఇరాన్ దాడి చేసింది. దానికి ప్రతిస్పందనగా అమెరికా ఈ దాడులు చేసింది. అయితే ఈ దాడులతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే పశ్చిమాసియాలో హమాస్-ఇజ్రాయెల్ యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య కూడా దాడులు, ప్రతిదాడులు జరుగుతుండడంతో పశ్చిమసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యద్ధం కారణంగా రెండు వైపుల తీవ్ర ప్రాణనష్టం జరిగింది. ఒక్క గాజాలోనే 10,500 మంది చనిపోయారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారుల సంఖ్యనే అధికంగా ఉండడం ఆందోళన కల్గిస్తోంది.

Updated Date - 2023-11-09T11:13:22+05:30 IST