Narendra Modi: బీజేపీ టార్గెట్-9లో తెలంగాణ.. మోదీ పోటీ పక్కానా..?

ABN , First Publish Date - 2023-01-17T21:15:55+05:30 IST

ఉత్తర భారతదేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ (BJP) దక్షిణాదిపై మాత్రం అంతగా పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలోనూ కాషాయ జెండా రెపరెపలు

Narendra Modi: బీజేపీ టార్గెట్-9లో తెలంగాణ.. మోదీ పోటీ పక్కానా..?

హైదరాబాద్: ఉత్తర భారతదేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ (BJP) దక్షిణాదిపై మాత్రం అంతగా పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలోనూ కాషాయ జెండా రెపరెపలు చూడాలని భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి మోదీ పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. అదే జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. నిజానికి మోదీ తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు కొత్తగా తెలంగాణ పేరు వినిపిస్తోంది. మోదీ పోటీ చేయబోయే లోక్‌సభ స్థానాలను బీజేపీ ఇప్పటికే గుర్తించిందని, అయితే మల్కాజిగిరి లేదంటే పాలమూరు నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం. మోదీ తెలంగాణ నుంచి పోటీ చేసే విషయాన్ని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న వార్తలను కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. మోదీ ఈసారి యూపీ నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, గుజరాత్‌ (Gujarat)ను వీడి మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాబోరని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పారు. అయితే, అనూహ్యంగా మోదీ యూపీలోని వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దేశంలోనే యూపీ (uttar Pradesh) అతిపెద్ద రాష్ట్రం. అక్కడ విజయం సాధించే పార్టీ కేంద్రంలో గద్దెనెక్కడం ఖాయం. కాబట్టే ప్రధాన పార్టీలన్నీ యూపీని లక్ష్యంగా చేసుకుంటాయి. బీజేపీ కూడా గత ఎన్నికల్లో ఇలాంటి వ్యూహమే రచించి అద్భుత విజయాన్ని అందుకుంది. యూపీని దున్నిపడేయాలని భావించి మోదీ అక్కడి నుంచి పోటీ చేశారు. ఆయన పోటీతో యూపీలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడడంతో తిరుగులేని విజయం సాధించింది. కాబట్టి మోదీ తెలంగాణలో పోటీ చేస్తారన్న వార్తలను తేలిగ్గా తీసుకోవడానికి లేదని చెబుతున్నారు. మోదీ కాదంటే కేంద్రమంత్రి అమిత్ షా అయినా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేసీఆర్‌కు అగ్ని పరీక్ష

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కత్తులు దూస్తున్న వేళ వారిని ఎదురొడ్డడం, మరీ ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవడం ఏమంత తేలిక కాకపోవచ్చు. కాంగ్రెస్ విషయంలో భయపడాల్సిన అవసరం లేకపోయినా ఓట్లు చీల్చే సామర్థ్యం ఆ పార్టీకి ఉంది. ఫలితంగా బీజేపీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్‌ను తేలిగ్గా తీసుకోకూడదని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్‌కు ఇప్పటికే సెగ తగలింది. బీజేపీని ఎదురొడ్డేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. హిందుత్వ కార్డును ఉపయోగిస్తూ కేసీఆర్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన ఆయనను స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ మెచ్చుకున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆయనను ఫాలో కావాలని సూచించారు. సంజయ్ కృషిని మెచ్చుకున్నారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలోను, పార్టీ పేరును ప్రజల్లో సజీవంగా ఉంచడంలోను సంజయ్ విజయం సాధించగలిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ను బీజేపీ ముప్పుతిప్పలు పెట్టింది. దాదాపు విజయం సాధించేంత పనిచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని కేంద్ర పెద్దలు కూడా కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే మోదీని తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

బీజేపీలోకి పొంగులేటి

బీఆర్ఎస్‌పై బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 18న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఖమ్మం బహిరంగ సభ జరిగే రోజే పొంగులేటిని బీజేపీకి ఆహ్వానించడం ద్వారా బీఆర్ఎస్‌కు దెబ్బ కొట్టాలని యోచిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. ఇటీవలి కాలంలో పలు రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారుతున్న తెలంగాణలో ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో!

9 రాష్ట్రాలపై బీజేపీ దృష్టి

తెలంగాణ సహా ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని కంకణం కట్టుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ ఇదే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనా అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల శాతం ఒకటి కంటే తక్కువేనని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో అలాంటివి జరగకుండా ఇతర పార్టీలు బలంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు నడ్డా దిశానిర్దేశం చేశారు.

Updated Date - 2023-01-17T21:15:56+05:30 IST