TSPSC Paper Leak: ఇక్కడ లీకై దేశాలు చుట్టేసింది? కీలక సమాచారం సేకరించిన ఈడీ!

ABN , First Publish Date - 2023-04-19T11:52:20+05:30 IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leak)లో చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ విచారణను ఈడీ పూర్తిచేసింది.

TSPSC Paper Leak: ఇక్కడ లీకై దేశాలు చుట్టేసింది? కీలక సమాచారం సేకరించిన ఈడీ!
TSPSC Paper Leak

టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు మల్యాలతో లింకేంటి?

న్యూజిలాండ్‌లో ఎందరికి చేరింది?

డీల్‌ సక్సెస్‌ అయితే ఎంత వచ్చేది??

జైలులో ముగిసిన ఈడీ విచారణ

రూ. 27.5 లక్షలపై ప్రధానంగా ప్రశ్నలు

ప్రవీణ్‌, రాజశేఖర్‌ను 10 గంటలు విచారించిన ఈడీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leak)లో చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ విచారణను ఈడీ పూర్తిచేసింది. సోమ, మంగళవారాల్లో సుమారు 10 గంటల పాటు వారిని పలు కోణాల్లో ప్రశ్నించింది. మల్యాల మొదలు.. న్యూజిలాండ్‌ దాకా ప్రశ్నపత్రం లీకైన తీరును.. ఆ లింకులను నిందితుల నుంచి రాబట్టుకుంది. తొలిరోజు వ్యక్తిగత వివరాలు, కుటుంబ, ఉద్యోగ, ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నించిన ఈడీ.. రెండో రోజు పూర్తిగా మనీలాండరింగ్‌పై దృష్టిసారించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు సుమిత్‌ గోయల్‌, దేవేందర్‌ కుమార్‌ సింగ్‌, న్యాయవాదులతో కలిసి.. డిప్యూటీ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ప్రవీణ్‌, రాజశేఖర్‌ను విడివిడిగా.. ఆ తర్వాత కలిపి ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి అసలు ఎంత మొత్తానికి డీల్‌ కుదిరింది? మొదటి విడతగా చేతులు మారిందెంత? అంతా అనుకున్నట్లు జరిగితే ఎంత వచ్చేది? ఇలా అనేక అంశాలపై నిందితులిద్దర్నీ ఈడీ విచారించింది. ఇప్పటి వరకు చేతులు మారిన రూ. 27.5 లక్షల గురించి ఈడీ లోతుగా విచారించినట్లు తెలిసింది. డీఏవో ప్రశ్నపత్రం కోసం ప్రవీణ్‌ ఖమ్మం జిల్లాకు చెందిన దంపతుల నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఈ మొత్తాలను ఏయే రూపాల్లో తీసుకున్నారు? ఏయే బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ జరిగింది? చేతికందిన క్యాష్‌ ఎంత? అనే అంశాలపై విచారణను కొనసాగించినట్లు తెలిసింది.

మాల్యాల ఉంచి న్యూజిలాండ్‌కు..

ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రాజశేఖర్‌ స్వస్థలం జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం. ఈ మండలంలో 40 మందికి పైగా అభ్యర్ధులకు 100కు పైగా మార్కులు వచ్చాయి. ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్ధుల్ని సిట్‌ ఇదివరకే విచారించింది. ఈ కోణంలోనూ ప్రవీణ్‌, రాజశేఖర్‌లను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌ బావ.. లీకైన ప్రశ్నపత్రంతో పరీక్ష రాసినట్లు ఇప్పటికే తేలింది. దీంతో అతనిపై కూడా ఈడీ దృష్టి సారించింది. న్యూజిలాండ్‌తోపాటు ఇతర దేశాల్లోని ఇంకెవరికైనా పరిచయస్తులకు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు చేరాయా? (TSPSC Paper Leak) అక్కడి నుంచి నగదు ఎలా చేతులు మారింది? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

Updated Date - 2023-04-19T11:52:20+05:30 IST