Crime: ఇంట్లో శవమై కనిపించిన 8 నెలల గర్భిణి.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-09-30T15:30:36+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో దారుణం జరిగింది. శుక్రవారం ఎనిమిది నెలల గర్భిణి ఇంట్లో శవమై కనిపించింది. అత్తమామలు పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చి చూసే సరికి రక్తంతో తడిసిన గర్భిణి మృతదేహం కనిపించింది.

Crime: ఇంట్లో శవమై కనిపించిన 8 నెలల గర్భిణి.. అసలు ఏం జరిగిందంటే..?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో దారుణం జరిగింది. శుక్రవారం ఎనిమిది నెలల గర్భిణి ఇంట్లో శవమై కనిపించింది. అత్తమామలు పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చి చూసే సరికి రక్తంతో తడిసిన గర్భిణి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మహిళ మృతదేహం వద్ద విరిగిన గాజులు కనిపించాయి. మహిళను గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం తెలియనుంది. కానీ హత్య జరిగినప్పటి నుంచి బాధితురాలి భర్త కనిపించకపోకుండా పోయాడు. దీంతో బాధితురాలిని ఆమె భర్తనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఖీ దేవి అనే మహిళకు రాజేంద్రతో 2021లో వివాహమైంది. మద్యానికి బానిసైన రాజేంద్ర తరచూ భార్య రాఖీతో గొడవపడేవాడు. అత్తమామలు పొలానికి వెళ్లడంతో శుక్రవారం రాఖీదేవి ఇంట్లో ఒంటరిగా ఉంది. రాజేంద్ర మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విరిగిన గాజులను బట్టి హత్యకు ముందు ఇద్దరు గొడవపడి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే పారిపోయిన రాజేంద్ర దొరికితే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. దీంతో ప్రస్తుతం పోలీసులు రాజేంద్రను పట్టుకునే పనిలో ఉన్నారు. ‘‘రాఖీ ఎనిమిది నెలల గర్భిణి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. రాజేంద్ర తన భార్యను అనుమానించేవాడు. ఆమె ఎవరితోనైనా మాట్లాడినప్పుడల్లా ఆమె ఫోన్‌ను తనిఖీ చేసేవాడు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆధారాలు సేకరిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-09-30T15:30:36+05:30 IST