Allanani: అందుకోసమే పవన్ ఏలూరు వచ్చారా?... జనసేనానిపై ఆళ్లనాని ఫైర్

ABN , First Publish Date - 2023-07-10T16:00:17+05:30 IST

ఏలూరులో వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆళ్లనాని ఫైర్ అయ్యారు.

Allanani: అందుకోసమే పవన్ ఏలూరు వచ్చారా?... జనసేనానిపై ఆళ్లనాని ఫైర్

ఏలూరు: ఏలూరులో వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆళ్లనాని (MLA Alla Nani) ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (AP CM Jagan)పేరు ఉచ్చరించే స్థాయి, అర్హత పవన్‌కు లేదన్నారు. సీఎం జగన్‌ను నువ్వు అని ఏకవచనంతో విమర్శించడానికి పవన్ ఏలూరు వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తే ప్రజలకు నష్టం అని కుంటి సాకులు చెప్పి సినిమా షూటింగ్‌లు చేసిన వ్యక్తి పవన్ అంటూ విరుచుకుపడ్డారు. ఏలూరులో అంబేద్కర్ సాక్షిగా పవన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి అవగాహన లేకుండా పవన్ నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు. అసాంఘిక శక్తులకు వాలంటీర్లు ప్రజల సమాచారాన్ని చేరవేస్తున్నారనడం దౌర్భాగ్యమన్నారు. కేంద్ర నిఘా వ్యవస్థ పవన్ చుట్టూ ఉందా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) నిఘా వ్యవస్థ, స్క్రిప్ట్ చదివి పవన్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

ఏలూరు వింత వ్యాధిపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. వారాహి యాత్రను ప్రజలు అడ్డుకునే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే చంద్రబాబు మార్గదర్శకంలో పవన్ విషం చిమ్మారని వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.19 కోట్లు, జగన్ హయాంలో రూ.80 కోట్లు వెచ్చించి తమ్మిలేరు రక్షణ గోడ 90 శాతం తానే నిర్మించినట్లు చెప్పారు. ఏలూరు ఆసుపత్రికి జీవం పోసి, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామన్నారు. కుట్రపూరితంగా అసత్యాలు చెప్పి ఏలూరు ప్రజలను పవన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏలూరు శ్మశానంలో ఫ్లాష్ స్వచ్చంద సంస్థ ఆక్రమణలు తొలగించింది తానే అని అన్నారు. శ్మశానంలో ఏసీ రూమ్‌లు, ఏసీ గదులు పెట్టారన్న ఫిర్యాదులపైనే చర్యలు తీసుకున్నామన్నారు. ఏలూరు అభివృద్ధిపై పవన్ ఎప్పుడు బహిరంగ చర్చకు అయినా తాము సిద్ధం అంటూ ఆళ్లనాని సవాల్ విసిరారు.

Updated Date - 2023-07-10T16:00:17+05:30 IST