Jagan: మార్చిలో సాగరతీరానికి జగన్... గోప్యంగా అన్వేషణ

ABN , First Publish Date - 2023-02-07T02:50:44+05:30 IST

మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. హుటాహుటిన విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించాలని తహతహలాడుతున్నా...

Jagan: మార్చిలో సాగరతీరానికి జగన్... గోప్యంగా అన్వేషణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. హుటాహుటిన విశాఖ(Vizag)కు పరిపాలనా రాజధానిని తరలించాలని తహతహలాడుతున్నా... కోర్టు కేసులు అడ్డంకిగా నిలిచాయి. దీంతో కనీసం అక్కడ తన క్యాంపు కార్యాలయాన్నైనా ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్‌ యోచిస్తున్నట్లు సమాచారం! తద్వారా మూడు రాజధానుల విషయంలో ఏదో ఒకటి చేశామనిపించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. బహుశా... వచ్చే నెల మూడోవారంలోనే విశాఖలో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశముంది. గత వారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో... త్వరలోనే తాను విశాఖకు మకాం మారుస్తానని సీఎం జగన్ (CM Jagan) చెప్పిన సంగతి తెలిసిందే. అంతకుముందే దీనిపై జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం అత్యంత గోప్యంగా సీఎం క్యాంప్‌ ఆఫీసు (CM Camp Office) కోసం భవనాల అన్వేషణ జరుపుతోంది. దీనిని రుషికొండపైన నిర్మిస్తున్న పర్యాటకశాఖ ప్రాజెక్టు భవనాల్లో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ... వచ్చే నెల మూడో వారానికి రుషికొండపై నిర్మాణాలు పూర్తికావని అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో తాత్కాలికంగా రుషికొండ, ఐటీ హిల్స్‌, మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం నాలుగైదు భవనాలను పరిశీలించారు. బీచ్‌ రోడ్డులోని కొన్ని భవనాలతోపాటు... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉప కులపతి, రిజిస్ట్రార్‌ బంగ్లాలను కూడా పరిశీలించారు. ఈ అన్వేషణ మొత్తం గోప్యంగానే సాగుతోంది.

Updated Date - 2023-02-07T09:31:37+05:30 IST