TDP MLC: నోరు అదుపులో పెట్టుకోండి... అంబటి, రోజాపై విరుచుకుపడ్డ పంచుమర్తి

ABN , First Publish Date - 2023-09-11T12:19:37+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యంలో చీకటిరోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలోని ప్రతి డకోటా గాడికి ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్‌తో 151 సీట్ల వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్యలు చేశారు.

TDP MLC: నోరు అదుపులో పెట్టుకోండి... అంబటి, రోజాపై విరుచుకుపడ్డ పంచుమర్తి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ప్రజాస్వామ్యంలో చీకటిరోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (TDP MLC Panchumarthi Anuradha) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలోని (YCP) ప్రతి డకోటా గాడికి ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్‌తో 151 సీట్ల వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్యలు చేశారు. దద్దమ్మ అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 72 శాతం పోలవరాన్ని పూర్తి చేసిన చంద్రబాబు గురించి ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు ఉంటాయో తెలియని అంబటి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా అంబటి న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మీద కేసులు మీద కేసులు వేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డే వెంట్రుక పీకలేకపోయాడు..జగనెంత అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎల్లేశ్వరం స్కామ్ జరిగిందని ప్రచారం చేసి చంద్రబాబుపై సోమశేఖర్ కమీషన్ వేసినా నాడు వైఎస్ ఏమీ నిరూపించలేక తోక ముడిచారన్నారు. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ప్రజాసేవ చేశారని.. నేడూ అదే సీన్ రిపీట్ కాబోతోందని ఎమ్మెల్సీ తెలిపారు.


వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు కాదు జగన్ రెడ్డి దిట్ట.. కాబట్టే 31 క్రిమినల్ కేసులున్నా 11 ఏళ్లుగా బెయిల్‌పై బయట తిరుగుతున్నారన్నారు. వివేకా హత్య కేసులో ఏకంగా సీబీఐని బెదిరించి మరీ ఏ-8 అవినాష్ రెడ్డి కాలర్ ఎగరేస్తున్నాడంటే జగన్ రెడ్డి వ్యవస్థలను మ్యానేజ్ చేయడం వల్ల కాదా అంటూ విరుచుకుపడ్డారు. ఇసుక, మద్యం మాఫియాలు, మెడికల్ కాలేజీ సీట్లు, సెంటు పట్టా కుంభకోణాలను దారి మళ్లించేందుకే చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేశారని అన్నారు. స్కిల్ అంటే ఏంటో తెలియని మంత్రి రోజా నోటికొచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రోజా ఆగడాలు తట్టుకోలేక వైసీపీ మంత్రులే మట్టుపెడుతున్నారన్నారు. అసలు స్థాయే లేని రోజా అన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడటమా? అని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే అరచేతి మందం మేకప్ వేసుకుని బాణాసంచా కాలుస్తావా రోజా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా నేడు వందల కోట్లకు ఎలా అధిపతి అయ్యిందో నగరి ప్రజలే కథలు కథలుగా చెబుతున్నారన్నారు. సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నేలకు 144 సెక్షన్ వర్తించదా అని ప్రశ్నించారు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదని.. త్వరలోనే వైసీపీ దుర్మార్గులకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. చంద్రన్న కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని.. మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పంచుమర్తి అనురాధ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-11T12:19:37+05:30 IST