100 days YuvaGalam: 100 రోజుల మైలురాయిని చేరనున్న యువగళం.. టీడీపీ ప్లాన్స్ ఇవే...

ABN , First Publish Date - 2023-05-11T12:10:40+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది.

100 days YuvaGalam: 100 రోజుల మైలురాయిని చేరనున్న యువగళం.. టీడీపీ ప్లాన్స్ ఇవే...

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తోంది. జనవరి 27న మొదలైన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. పలు ప్రాంతాల్లో పాదయాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిన్నంటినీ అధిగమిస్తూ లోకేష్ ముందుకు సాగారు. పలు సామాజిక వర్గీయులు, గ్రామాల ప్రజలు, రైతులు, యువతతో ఇలా అనేకమందితో లోకేష్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని.. తాము అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీర్చుతామంటూ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర ఈనెల 15వ తేదీకి 100 రోజుల మైలురాయిని చేరనుంది. దీంతో పాదయాత్రకు సంఘీభావంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘అడ్డంకులు అధిగమిస్తూ, విశేష ప్రజాధరణతో ముందుకు సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అభినందనలు. పాదయాత్ర ఈనెల 15వ తేదీన 100 రోజుల మైలురాయి చేరనుంది. ఈ సందర్భంగా అదే రోజున టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారి వారి నియోజకవర్గాలలో జరిగే సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము’’ అంటూ టీడీపీ జాతీయ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-05-11T12:10:48+05:30 IST