Lokesh Padayatra: కంచుకోట అనేదానికి మారుపేరు కుప్పం: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2023-01-27T16:53:37+05:30 IST

కంచుకోట అనేదానికి మారుపేరు కుప్పం అని టీడీపీ నేత నారా లోకేష్‌ (Nara Lokesh) స్పష్టం చేశారు. యువగళం, మనగళం, ప్రజాబలమన్నారు.

Lokesh Padayatra: కంచుకోట అనేదానికి మారుపేరు కుప్పం: నారా లోకేష్‌

కుప్పం: కంచుకోట అనేదానికి మారుపేరు కుప్పం అని టీడీపీ నేత నారా లోకేష్‌ (Nara Lokesh) స్పష్టం చేశారు. యువగళం, మనగళం, ప్రజాబలమన్నారు. యువగళం పేరు ప్రకటించిన వెంటనే వైసీపీ (YCP) నేతల ప్యాంట్లు తడిశాయని ఎద్దేవాచేశారు. లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర (Padayatra)కు శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో తొలి అడుగు పడింది. ఈ సందర్భంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. ‘‘నేను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల పనులు చేశాను. యువతకు ఉద్యోగాలు ఇప్పించాను. మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటి?.. పొట్టి శ్రీరాములు వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీసీఎం ఎన్టీఆర్ (NTR) జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఏపీకి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ (CM Jagan) 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు’’ అని లోకేష్‌ ధ్వజమెత్తారు.

జగన్‌ రెడ్డి అంటే జాదూ రెడ్డి అని దుయ్యబట్టారు. ఏడాదిలోనే 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారని, ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్ (Job Calendar) రిలీజ్ చేస్తానన్నారని గుర్తుచేశారు. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని, జే ట్యాక్స్‌ కట్టలేదని పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని తప్పుబట్టారు. ‘జే ట్యాక్స్‌ ఫుల్లు.. పెట్టుబడులు నిల్లు. పరిశ్రమలన్నీ బై.. బై.. ఏపీ అంటూ వెళ్లిపోతున్నాయి’ అని లోకేష్‌ తెలిపారు. చంద్రబాబు హయాంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు.

నేను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదు

3 రాజధానులు అన్నారని ఒక్క ఇటుక అయినా వేశారా? అని లోకేష్‌ ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ అయినా ఏర్పాటు చేశారా అని నిలదీశారు. త్వరలో యువత కోసం యూత్‌ మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. తనకు చీర, గాజులు పంపిస్తానని మహిళా మంత్రి అన్నారని, చీర, గాజులు పంపించాలని వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని పేర్కొన్నారు. తాను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెలిపారు. జే బ్రాండ్‌తో మహిళల మంగళసూత్రాలు తెంపుతున్న జాదూరెడ్డి అని జగన్‌పై మండిపడ్డారు. ఏపీని రైతులు లేని రాజ్యం చేస్తున్నారని, రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు.

‘‘జగన్‌ రెడ్డి సాగునీటి పనులను పడుకోబెట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో ఇసుక దొరకడం లేదు. ఇసుకను జాదూరెడ్డి దోచేస్తున్నారు. భవన నిర్మాణ పనులు నిలిచి కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం’’ అని లోకేష్‌ ప్రకటించారు.

Updated Date - 2023-01-27T19:25:05+05:30 IST