Kotamreddy : ఆదాలను.. పెళ్లి పీటల మీద కూర్చోబెడితే.. తాళి తీసుకుని పరిగెత్తాడు..

ABN , First Publish Date - 2023-02-09T11:24:57+05:30 IST

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య వార్ ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. నేడు కోటంరెడ్డి మరోమారు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై విమర్శలు గుప్పించారు.

Kotamreddy : ఆదాలను.. పెళ్లి పీటల మీద కూర్చోబెడితే.. తాళి తీసుకుని పరిగెత్తాడు..

నెల్లూరు : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య వార్ ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. నేడు కోటంరెడ్డి మరోమారు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై విమర్శలు గుప్పించారు. మేయర్‌తో సహా 11 మంది కార్పోరేటర్లు తన వెంట ఉన్నారని కోటంరెడ్డి ప్రకటించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వైపు వెళ్లిన వారు.. రాజకీయంగానే కాదని.. మానసికంగా కూడా తనకు దగ్గరగా ఉన్నారన్నారు. ఆరు నెలల తరువాత చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తారన్నారు. రెండుసార్లు మీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి, ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలతో సహా ఆరోపణ చేశానన్నారు.

ఇంకా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొండని తవ్వి ఎలుకని‌ కూడా పట్టలేనట్టు వ్యవహారిస్తున్నారు. కేంద్ర హోం శాఖకి నేను ఫిర్యాదు చేసినట్టే, ప్రభుత్వం కూడా విచారణ కోరాలి. ఇలా ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారో అనే అనుమానాలు ప్రజల్లో తొలుగుతాయి. నా స్నేహితుడు సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్‌ను కూడా సరిగా చదవలేకపోయాడు. 4వ తేదీ వరకూ ఆడియో ఉందట... 5వ తేదీ డిలీట్ చేశాడట. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్రానికి లేఖ రాయండి. కేంద్ర నిఘా సంస్థ వస్తే, ఎవరెవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో తేలిపోతుంది. ఆదాల ప్రభాకర్‌రెడ్డిని... పెళ్లి కొడుకుని చేసి పీటల మీద కూర్చోబెట్టి.. పంతులుగారు తాళిబట్టు ఇస్తే... జేబులో‌ పెట్టుకుని పరుగు తీశాడు. టీడీపీ అభ్యర్ధిగా ప్రచారం చేస్తూ గత ఎన్నికల్లో వైసీపీకి వెళ్లిపోయాడు. ఇప్పటికీ ప్రజల్లో ఆదాలపై అనుమానం ఉంది.

వేల కోట్ల ఆస్థులున్న మీతో ఢీకొనడానికి నేను సిద్ధం. ఆదాల తాను, తన కుటుంబ సభ్యులు రూరల్‌లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆయన మాట నిలబెట్టుకోవాలి. అలా చేస్తే నేను ఇకపై ఆరోపణలు చేయను. సజ్జల, మంత్రి కాకాణికి కూడా డౌటున్నట్టు ఉంది. పదే పదే... నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఆదాల అని చెబుతున్నారు. నికరంగా పోటీ చేయాలని అనుకుంటే స్పష్టత ఇవ్వాలి. ఆదాల అన్ని పనులు చేయిస్తానని చెప్పారు. అలా చేస్తే సీఎం, ఆదాలకి కృతజ్ఞతలు చెబుతాం. లేదంటే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం’’ అని కోటంరెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-02-09T11:48:49+05:30 IST