Chandrababu Dharna: రోడ్డుపై చంద్రబాబు ధర్నా... గుడిపల్లిలో హైటెన్షన్

ABN , First Publish Date - 2023-01-06T14:19:21+05:30 IST

జిల్లాలోని గుడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Chandrababu Dharna: రోడ్డుపై చంద్రబాబు ధర్నా... గుడిపల్లిలో హైటెన్షన్

చిత్తూరు: జిల్లాలోని గుడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (TDP Chief Chandrababu Naidu)ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు టీడీపీ అధినేత (TDP Chief) యత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రచార రథం అప్పగించాలంటూ టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. గుడిపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.

పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సమావేశం జరుగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులదేన్నారు. టీడీపీ కార్యకర్తలు (TDP Activists) రాకుండా బారికేడ్లు పెడతారా అంటూ మండిపడ్డారు. మూడు రోజులుగా పోలీసుల అరాచకాలను చూస్తున్నామన్నారు. బానిసలుగా బతకద్దని పోలీసులకు సూచించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘నన్ను పంపేయాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తా’’ అని అన్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. వైసీపీ నేతల ర్యాలీలు చేస్తున్నారని.. వారికో రూలు...తమకో రూలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే పోలీసులపై ప్రజలు ఉమ్మేస్తారన్నారు. ‘‘నా నియోజకవర్గంలోనూ నేను పర్యటించకూడదా?. నా ప్రజలను కలిసేందుకు నాకు హక్కు లేదా?. ఏపీలో సైకోరెడ్డి పాలన కొనసాగుతోంది. ప్రజాహితం కోసమే నా పోరాటం. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమే’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-06T14:35:01+05:30 IST