CBI: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని 4 గంటలు ప్రశ్నించిన సీబీఐ

ABN , First Publish Date - 2023-03-14T20:17:06+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy)ని సీబీఐ (CBI) అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు.

CBI: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని 4 గంటలు ప్రశ్నించిన సీబీఐ

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy)ని సీబీఐ (CBI) అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు. ఉదయం 11.30 గంటలకు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ బృందంలోని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు 4 సార్లు హాజరయ్యారు. మంగవారం జరిగిన సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. అయితే అవినాశ్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. తన తీర్పును రిజర్వు చేశారు.

వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయరాదని.. తనను విచారించకుండా అడ్డుకోవాలని.. తన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని.. విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున స్పెషల్‌ పీపీలు నాగేంద్రన్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. అవినాశ్‌రెడ్డి పాత్రకు సంబంధించిన వివరాలతో భారీ సీల్డ్‌ కవర్‌ను కోర్టుకు అందజేశారు.

Updated Date - 2023-03-14T20:17:53+05:30 IST