TRS MLAs poaching case: సీఎం కేసీఆర్‌ను సీబీఐ ప్రశ్నించే అవకాశం!

ABN , First Publish Date - 2022-12-29T19:20:12+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును తెలంగాణ హైకోర్టు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది.

TRS MLAs poaching case: సీఎం కేసీఆర్‌ను సీబీఐ ప్రశ్నించే అవకాశం!
CBI may question CM KCR in TRS MLAs poaching case

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును (TRS MLAs poaching case) తెలంగాణ హైకోర్టు సిట్ నుంచి సీబీఐ(CBI)కి బదిలీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు, మెటీరియల్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు ఎలా చేరాయని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో వీటిని ఎవరు, ఎప్పుడు, ఎలా అందజేశారన్న అంశంపై ఇప్పటికీ ఉన్న మిస్టరీని తొలగించేందుకు ముఖ్యమంత్రిని సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ చట్టం ప్రకారం, లేదా ఏ నిబంధనల ప్రకారం ఆధారాలు మొత్తం ముఖ్యమంత్రికి చేరాయో సిట్‌ గానీ, ప్రభుత్వం గానీ వివరించలేదని హైకోర్ట్ వ్యాఖ్యానించడంతో దీనిపై సీబీఐ నిగ్గు తేల్చే అవకాశం ఉంది.

వందల కోట్ల ఆఫర్ ఎవరిచ్చారనే విషయం తేల్చేందుకే!

వందల కోట్ల ఆఫర్ ఎవరిచ్చారనే విషయం తేల్చేందుకు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED) ఈ కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిని ప్రశ్నించింది. సీబీఐ కూడా ఎవరు ప్రలోభ పెట్టాలనుకున్నారనే విషయంపై రోహిత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. అంతేకాదు రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లి సీఎం ఆదేశాల మేరకు అక్కడే కొద్దిరోజుల పాటు ఉన్నారు. తర్వాత కూడా సీఎం చెప్పినట్లు నడచుకున్నారు. ఈడీ ప్రశ్నించడానికి పిలిచినప్పుడు కూడా రోహిత్ రెడ్డి సీఎం‌ను కలిశాకే వెళ్లారు. దీంతో ఈ కేసులో అసలు దోషులను గుర్తించేందుకు సీబీఐ రోహిత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఇప్పటికే విడుదల

ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఈ నెల 26న ఇచ్చిన తీర్పునకు సంబంధించి అధికారిక ఉత్తర్వుల కాపీ బుధవారం వెలువడింది. దీని ప్రకారం.. జీవో నెంబర్‌ 63 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఏకసభ్య ధర్మాసనం కొట్టేసింది. ఇప్పటివరకు రాజేంద్రనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, సిట్‌ చేసిన దర్యాప్తును రద్దు చేసింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, అక్టోబరు 26 నాటి అబ్జర్వేషన్‌ పంచనామాను, 27 నాటి మీడియేటర్‌ పంచనామాను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ మొదటి నుంచి కొత్తగా దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ న్యాయవాదులు వివరణ ఇవ్వలేదు

పోలీసుల దర్యాప్తులో భాగంగా సేకరించిన ఎవిడెన్స్‌లు ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో ఎలా ప్రత్యక్షమయ్యాయనే విషయంపై ప్రభుత్వ న్యాయవాదులు వివరణ ఇవ్వలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవిడెన్స్‌ మెటీరియల్‌ లీకేజీపై ప్రతివాదులు చాలా తెలివిగా వ్యూహాత్మక మౌనం పాటించారని పేర్కొంది. ఎవిడెన్స్‌లను ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు అన్ని రాష్ట్రాల చీఫ్‌ జస్టి్‌సలకు పంపించారని తెలిపింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తీవ్ర నేరమైనప్పటికీ చట్టంలో పేర్కొన్న నిబంఽధనలు, ప్రొసీజర్‌ ఉల్లంఘనకు గురయ్యాయా, లేదా అన్న అంశాన్ని ప్రధానంగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని, అయితే ఆధారాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టిన తీరు మాత్రం నిందితుల హక్కులకు భంగం కలిగించేదేనని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఘటనలు క్రిమినల్‌ లా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జరిగాయని తెలిపింది. కేసు నిరూపితమయ్యే వరకు ప్రతి నిందితుడు తప్పు చేయని వ్యక్తి కిందే లెక్క అనే ప్రాథమిక సూత్రం ఈ కేసు దర్యాప్తులో కనిపించలేదని పేర్కొంది.

నిందితులు హక్కులకు దూరమయ్యారు..

కుట్రదారులుగా జరిగిన ప్రచారం వల్ల నిందితులు తమ హక్కులకు దూరమయ్యారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను చట్టప్రకారం ఎదుర్కోవడానికి, న్యాయపరంగా తమ ఎదుట ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకునే అవకాశాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించింది. ప్రాథమిక దశలోనే నిందితులను కుట్రదారులుగా అభివర్ణించి.. వారి హక్కులకు ఎటువంటి భంగం కలగలేదని చెప్పడాన్ని ఆమోదంచలేమని తెలిపింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ పోలీసులు చట్టప్రకారం వ్యవహరించకపోతే వ్యవహారాలను చక్కదిద్దడానికి ఆర్టికల్‌ 226 కింద తమ జోక్యం తప్పదని స్పష్టం చేసింది. దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారాలను థర్డ్‌ పార్టీలకు ఇవ్వకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. అత్యంత కీలకమైన ఆధారాలు ఇతరులకు చేరకుండా అడ్డుకోవడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని, తద్వారా వారు తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే నవంబరు 9న రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని ఆక్షేపించింది. మొత్తం ఘటనల నేపథ్యంలో సిట్‌, ప్రభుత్వ వాదన న్యాయపరిశీలనకు నిలువదని పేర్కొంది. క్రిమినల్‌ చట్టం పరిధిలో నిందితుల హక్కులకు అత్యున్నత స్థానం ఉందని ‘అంకుశ్‌ మారుతీ షిండే’ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. పారదర్శక, వివక్షలేని దర్యాప్తు.. నిందితులకు ఉన్న హక్కులని, ఈ కేసులో అవి ఓడిపోయాయని వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌14, 21ప్రకారం నిందితుల హక్కులకు భంగం వాటిల్లిందని పేర్కొంది.

సీఎం బహిరంగంగా వీడియోలు షేర్‌ చేశారు

రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పదవిలో ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రే స్వయంగా ఎవిడెన్స్‌ వీడియోలను షేర్‌ చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం స్వయంగా నిందితులను కుట్రదారులుగా అభివర్ణిస్తూ ప్రచారం చేశారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో సిట్‌.. ముఖ్యమంత్రి చెప్పినదానికి భిన్నంగా వ్యవహరిస్తుందని ఆశించలేమని పేర్కొంది. నిందితులు తమ హక్కులకు భంగం కలిగిందని నిరూపించారని చెప్పడంలో తమకు ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. టీఆర్‌ఎ్‌స(బీఆర్‌ఎస్‌), బీజేపీ మధ్య నెలకొన్న రాజకీయ పోరులో నిందితుల హక్కులను పూర్తిగా మరిచిపోయి వ్యవహరించారని తెలిపింది. దర్యాప్తు బదిలీ చేయడానికి ఇది తగిన కేసు అని స్పష్టం చేసింది. కాగా, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలకు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీ ప్రభుత్వానికి అందేవరకు ఆదేశాల అమలును నిలిపేస్తున్నట్లు ఽధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. బుధవారం తీర్పు కాపీ బయటకురావడంతో సర్టిఫైడ్‌ కాపీ కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం సవాల్‌ చేయనుంది.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యూహం బెడిసికొట్టిందా?

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యూహం బెడిసికొట్టిందా? ఈ కేసును తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చేసిన ప్రయత్నమే ప్రస్తుతం కీలకమైన మలుపునకు కారణమైందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో ప్రయోజనం పొందేందుకు, ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీఎం కేసీఆర్‌ వాడుకున్నారని, కానీ.. అదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పు వెలువరించడానికి ప్రధాన కారణం కూడా సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలేనన్న వాదన వినిపిస్తోంది. విచారణ అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం బయటకు ఎలా వెళ్తుందన్న అంశమే కేసును సీబీఐకి బదిలీ చేయడానికి కారణమైందని స్పష్టమవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అన్ని అంశాలను అంచనా వేశాక, న్యాయనిపుణులతోనూ చర్చించిన తర్వాతే రాజకీయ కోణంలో దీనిని విస్తృత ప్రచారంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఈ కేసును ప్రచారం చేయాలన్న సీఎం నిర్ణయంలో ఈ ఉద్దేశమే కనిపిస్తోంది. అయితే ఆ వ్యూహమే ఇప్పుడు ఇబ్బందికరంగా పరిణమించింది.

ఎలాంటి డబ్బు లభించకపోయినా రూ.100 కోట్లకు బేరం అంటూ ప్రచారం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అక్టోబరు 26న వెలుగులోకి రాగా, అదే సమయంలో రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది. నవంబరు 3న పోలింగ్‌ జరిగింది. అప్పటివరకు అనధికారికంగా ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని బయటకు విడుదల చేశారు. కానీ, ఈ కేసును ఉప ఎన్నికలో ఉపయోగించుకునే ఉద్దేశంతో విస్తృత ప్రచారంలోకి తీసుకువచ్చిన్నట్టు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలను నేరుగా ఎవరూ బయటకు చెప్పకపోయినా.. ప్రభుత్వంలోని కొంత మంది ద్వారా ఫొటోలు, వీడియోలు, ఆడియోలను విడుదల చేశారు. పైగా సంఘటనలో ఎలాంటి డబ్బు లభించకపోయినా రూ.100 కోట్లకు బేరం అంటూ ప్రచారం చేశారు. ఇలా మునుగోడు పోలింగ్‌ వరకు ఈ ప్రచారం కొనసాగించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్‌ స్వయంగా విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. తద్వారా బీజేపీని రాజకీయంగా దెబ్బతీయవచ్చని భావించారు. కానీ, ఈ చర్యల ద్వారా సాంకేతికంగా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు కేసు మలుపునకు కారణమైందంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సమస్య తప్పకపోవచ్చు

కేసు విచారణ సీబీఐ వంటి కేంద్ర సంస్థ చేతుల్లోకి వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సమస్య తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసుకు సంబంధించిన సమాచారం లీకేజీపై కూడా సీబీఐ అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉందని, అదే జరిగితే మరో అనూహ్య మలుపు తప్పదని అంటున్నారు.

Updated Date - 2022-12-29T19:33:41+05:30 IST