Share News

సెప్టెంబరులోనూ తక్కువ వర్షపాతమే!

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:39 AM

నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవనాల సీజన్‌లో చివరి నెల అయిన సెప్టెంబరులో కూడా రాష్ట్రం, దేశంలోని అనేక ప్రాంతాల్లో దీర్ఘకాలిక సగటులో 91 శాతం వర్షపాతం నమోదుకానుంది.

సెప్టెంబరులోనూ తక్కువ వర్షపాతమే!

  • మధ్య కోస్తా, సీమలోని కొద్దిప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షాలు: ఐఎండీ

విశాఖపట్నం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవనాల సీజన్‌లో చివరి నెల అయిన సెప్టెంబరులో కూడా రాష్ట్రం, దేశంలోని అనేక ప్రాంతాల్లో దీర్ఘకాలిక సగటులో 91 శాతం వర్షపాతం నమోదుకానుంది. గత మూడు నెలల కాలంలో సాధారణం కంటే 53.7 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు బాగా దెబ్బతింది. సెప్టెంబరు కూడా రైతులకు నిరాశే మిగల్చనుంది. దేశవ్యాప్తంగా సెప్టెంబరులో వర్షాలు, ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని మధ్య కోస్తా.. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు, రాయలసీమలో ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనావేసింది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోనూ సెప్టెంబరులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, దక్షిణ బిహార్‌, కశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాదిలోని కొద్ది ప్రాంతాల్లో మాత్రం సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. మధ్యభారతంలో ఎక్కువ రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురవడం కొంత ఊరటనిచ్చినా బిహార్‌, ఏపీ, ఉత్తర కర్ణాటక, దక్షిణ తెలంగాణ, మరాట్వాడ, తమిళనాడు, కేరళలో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆగస్టులో సాధారణం కంటే 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో మరింత తీవ్రంగా మారనున్నదనే సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నీటి వనరులు, జల విద్యుత్‌ ఉత్పత్తి, తాగునీరు లభ్యత, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు. అయితే హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఐవోడీ సెప్టెంబరులో పాజిటివ్‌గా మారి దక్షిణాదిలో వర్షాలు పెరుగుతాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.



ఇవి కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..


పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 06:40 AM