వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!
ABN , Publish Date - May 24 , 2026 | 02:36 PM
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది
నారాయణఖేడ్, మే 24: మనుషుల మధ్య నైతిక విలువలు నశిస్తున్నాయనడానికి నారాయణఖేడ్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘోరమే నిదర్శనం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చింది. పోలీసుల కథనం ప్రకారం..
నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నారాయణఖేడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కల్పనకు, చింటూ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో, భర్తను అడ్డుతొలగించుకోవాలని కల్పన పథకం వేసింది.
తొమ్మిది రోజుల క్రితం ప్రియుడితో కలిసి ముత్యంరెడ్డిని మనూర్ మండలం ఎల్గోయి గ్రామ శివారుకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసింది. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని అక్కడే గుంత తవ్వి పూడ్చిపెట్టింది. ముత్యంరెడ్డి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు, కల్పన ప్రవర్తనపై అనుమానంతో విచారించగా ఈ ఘోరం వెలుగుచూసింది. శనివారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హైదరాబాద్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా ఎదగాలి: కిషన్రెడ్డి
బీఆర్ఎస్లో హరీశ్రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు