Share News

ప్రజల మధ్యకు పోలీసు బాసులు

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:18 AM

రాష్ట్ర పోలీసింగ్‌ కొత్త ఒరవడి దిశగా దూసుకెళుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కేవలం సమావేశాల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో.. ఆదేశాలతో మాత్రమే కాకుండా ప్రత్యక్ష పర్యవేక్షణతో ‘ప్రజల మధ్య పోలీసింగ్‌’కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.

ప్రజల మధ్యకు పోలీసు బాసులు
Telangana Police

  • రాష్ట్ర పోలీసింగ్‌లో కొత్త ఒరవడి..

  • సీఎం రేవంత్‌ ఆదేశాలతో మారుతున్న ముఖచిత్రం

  • ఏఐ, డేటా అనలిటిక్స్‌తో స్మార్ట్‌గా విధులు

  • వేగంగా దర్యాప్తులు.. కట్టుదిట్టమైన భద్రత

  • రాష్ట్రంలో సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

  • డ్రగ్స్‌, సంఘటిత నేరాలపై ఉక్కుపాదం

  • విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యత

  • డీజీపీ సీవీ ఆనంద్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసింగ్‌ కొత్త ఒరవడి దిశగా దూసుకెళుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కేవలం సమావేశాల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో.. ఆదేశాలతో మాత్రమే కాకుండా ప్రత్యక్ష పర్యవేక్షణతో ‘ప్రజల మధ్య పోలీసింగ్‌’కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసు మాత్రమే కాదు ఫర్మ్‌ పోలీసింగ్‌ ఉండాలన్న సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల పోలీసు అధికారుల సమీక్షలో పోలీసుశాఖకు సంబంధించి స్పష్టమైన విజన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఉన్నతాధికారులు ఆ విజన్‌ను ఆచరణలో పెడుతున్నారు.


డీజీపీ నుంచి డీసీపీల దాకా..

సీఎం ఆకాంక్షించిన పోలీసింగ్‌ క్షేత్రస్థాయిలో కనిపించేలా డీజీపీ సీవీ ఆనంద్‌ చర్యలు చేపట్టారు. వివిధ అంశాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ, జిల్లా పర్యటనల ద్వారా క్షేత్రస్థాయి పోలీసింగ్‌పై దృష్టిపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత ప్రాధాన్యంగా ప్రతి జిల్లా ఎస్పీ, కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల మధ్యకు వెళ్లాలన్న సందేశాన్ని ఐపీఎస్‌ అధికారుల నుంచి కానిస్టేబుల్‌ వరకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలు వివిధ అంశాలపై క్షేత్ర స్థాయికి వెళుతున్నారు. నాకాబందీ, డ్రగ్స్‌ తనిఖీలు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఈవ్‌ టీజింగ్‌ సమస్య ఇలా ఏ అంశమైనా సరే సీనియర్‌ అధికారి ఫీల్డ్‌లో కనిపిస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సీఎం ఆలోచనను అమలు చేస్తున్నారు.


సాంకేతికత విస్తృత వినియోగం..

పోలీసు అధికారులు ఇటీవలికాలంలో కృత్రిమ మేధ (ఏఐ), డేటా అనలిటిక్స్‌, డ్రోన్లు, వీడియో అనలిటిక్స్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ వంటి అధునాతన సాంకేతిక సాధనాలను దర్యాప్తులో విస్తృతంగా వినియోగిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్‌ ఉజ్జయని మహంకాళి బోనాల వేడుకలో నేరస్తులను గుర్తించేందుకు ఏఐ ఫేస్‌ రీడింగ్‌ను వాడారు. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో డ్రోన్‌ పెట్రోలింగ్‌ చేస్తున్నారు. సైబర్‌ నేరాల పరిష్కారంలో దేశంలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ఈగిల్‌ ఫోర్స్‌, స్థానిక పోలీసులను సమన్వయం చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.


ప్రత్యక్ష పర్యవేక్షణ.. ప్రజలకు అందుబాటు: సీవీ ఆనంద్‌

విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ, బీట్‌ వ్యవస్థ బలోపేతం, ప్రజలకు అందుబాటులో ఉండటం, ఫిర్యాదు వచ్చినపుడు వేగంగా స్పందించే వ్యవస్థను సిద్ధం చేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టామని డీజీపీ సీవీ ఆనంద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, పోలీసుస్టేషన్ల పనితీరుపై ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరమని ఆదేశించామని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖను చట్టం అమలు చేసే వ్యవస్థగానే కాకుండా, ప్రజలకు చేరువైన వ్యవస్థగా కూడా తీర్చిదిద్దే లక్ష్యంతో బ్లూప్రింట్‌ సిద్ధం చేసుకుని, అమలు చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, ఫ్యూచర్‌సిటీ, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి వెళుతున్నారని ఆనంద్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు

సహజీవనం జంటలకూ గృహహింస చట్టం

Updated Date - Aug 04 , 2026 | 07:18 AM