Share News

సహజీవనం జంటలకూ గృహహింస చట్టం

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:02 AM

గృహహింసకు సంబంధించిన ఐపీసీ సెక్షన్‌ 498ఏ.. సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తద్వారా లివిన్‌ రిలేషన్‌షి్‌పలో మహిళపై హింసకు పాల్పడిన పురుషుడిని...

సహజీవనం జంటలకూ గృహహింస చట్టం

  • వారికీ సెక్షన్‌ 498ఏ వర్తిస్తుంది

  • మహిళపై హింసకు పాల్పడిన

  • పురుషుడిని విచారించవచ్చు

  • సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: గృహహింసకు సంబంధించిన ఐపీసీ సెక్షన్‌ 498ఏ.. సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తద్వారా లివిన్‌ రిలేషన్‌షి్‌పలో మహిళపై హింసకు పాల్పడిన పురుషుడిని ఈ సెక్షన్‌ కింద విచారించవచ్చని తెలిపింది. జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పును వెలువరించింది. భర్త, అతని సంబంధీకులు భార్యను మానసికంగా, శారీరకంగా హింసించినప్పుడు సెక్షన్‌ 498ఏ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. అయితే, ఈ సెక్షన్‌ సహజీవనంలో ఉన్న జంటలకు కూడా వర్తిస్తుందా అన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. తాజాగా, ఓ కేసుపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు దీనిపై తీర్పును వెల్లడించింది. వివాహం చేసుకోవాలనుకునే ఆలోచనతో, వివాహబంధంలో ఉన్నట్లుగానే సహజీవనం చేసే జంటలకు ఈ సెక్షన్‌ వర్తిస్తుందని తెలిపింది. సహజీవనంలో ఉన్న మహిళపై పురుషుడుగానీ, అతడికి సంబంధించిన బంధువులుగానీ హింసకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిన తర్వాతే వారిని అరెస్టు చేయాలని సూచించింది. గృహహింసను నిరోధించటమే సెక్షన్‌ 498 లక్ష్యమని, అది భార్యాభర్తలకు వర్తించినట్లుగానే సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. ‘సంతోషకరమైన జీవితాన్ని గడపాలనే ఆశలతోనే స్త్రీ పురుష జంటలు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. అయితే, కాలం గడిచే కొద్దీ కొన్ని జంటలు సమస్యల బారిన పడతాయి. చట్టం అందరికీ సమానంగానే వర్తించాల్సి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 07:02 AM