సింగర్ మంగ్లీపై పంజాగుట్టలో కేసు నమోదు: న్యాయవాదికి ప్రాణహాని!. అసలేం జరిగింది?
ABN , Publish Date - Apr 11 , 2026 | 08:56 AM
ప్రముఖ సింగర్ మంగ్లీ (సత్యవతి), ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగులపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో మోసం చేయడం, ప్రశ్నించిన న్యాయవాదిని చంపుతామని బెదిరించడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలుగు రాష్ట్రాల్లో తన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడుల పేరుతో సామాన్యులను మోసం చేయడమే కాకుండా, బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసుల సమాచారం ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు సమాచారం. అయితే, కాలం గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోగా, అసలు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చెందారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. బాధితుల తరపున ఆయన ఈ వ్యవహారంపై స్పందించడంతో అసలు గొడవ మొదలైంది. బాధితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో న్యాయవాది నిలదీయగా, మంగ్లీ, ఆమె బృందం నుంచి బెదిరింపులు ఎదురైనట్లు తెలుస్తోంది.
సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను రోడ్డు ప్రమాదం (యాక్సిడెంట్) చేయించి చంపేస్తామని వారు హెచ్చరించారని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపుల వ్యవహారంలో దర్శకుడు వేణు ఉడుగుల పాత్ర కూడా ఉందని న్యాయవాది పోలీసులకు తెలిపారు.
న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం మంగ్లీ, శివ, వేణు ఉడుగుల, ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని న్యాయవాది కోరడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు.
వరుస హిట్ పాటలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న మంగ్లీపై ఇలాంటి క్రిమినల్ ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిపి నిజానిజాలను నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి