ప్రధాని మోదీ బహిరంగ సభ.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ సుమతి
ABN , Publish Date - May 09 , 2026 | 06:45 PM
రేపు హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి కీలక వివరాలను వెల్లడించారు..
హైదరాబాద్, మే 09: రేపు హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈ సభకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి కీలక వివరాలను వెల్లడించారు. సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలోకి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం విధించారు.
బహిరంగ సభ దృష్ట్యా.. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకూ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రోడ్లపై ఎక్కడైనా వాహనాలను పార్క్ చేస్తే.. వాటిని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశామని, వాహనదారులు పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా అక్కడ క్యూఆర్ (QR) కోడ్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News