ఆగి ఉన్న బస్సును ఢీకొన్న లారీ.. 20 మందికి గాయాలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 08:37 PM
నిజామాబాద్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సు, లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అంతేకాకుండా..
నిజామాబాద్ జిల్లా: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. జక్రాన్పల్లి మండలం ఆర్గుల్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సు, లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు, పోలీసుల సాయంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రహదారిపై ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
డివైడర్ ఎక్కి.. 100 మీటర్లు దూసుకెళ్లి..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై కూడా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఒక లారీ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం లారీ డివైడర్ పైకి ఎక్కి సుమారు 100 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది.
కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో రేషన్ పంపిణీ వేగవంతం
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.17 కోట్ల మత్తు పదార్థాలు సీజ్
Read Latest Telangana News