యాపిల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా.. క్షణాల్లోనే మొత్తం మాయం..
ABN , Publish Date - Jul 30 , 2026 | 06:32 PM
మహబూబాబాద్ జిల్లాలో యాపిల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఇంకేముందీ.. జనాలు మొత్తం అక్కడ గుమికూడారు. గాయపడిన డ్రైవర్ను కాపాడాల్సింది పోయి.. యాపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. చూస్తుండగానే మొత్తం ఖాళీ చేసేశారు..
మహబూబాబాద్, జులై 30: యాపిల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ను కాపాడాల్సింది పోయి.. యాపిల్ పండ్ల కోసం పోటీ పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వైరల్గా మారింది. హబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై యాపిల్ పండ్ల లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్కు గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడటంతో అందులో ఉన్న యాపిల్ పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే.. అక్కడ గుమికూడిన స్థానికులు.. ప్రమాదంలో చిక్కుకున్న డ్రైవర్ను పట్టించుకోకుండా పండ్లను ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు.
రోడ్డుపై పడిన యాపిల్స్ను తీసుకునేందుకు జనం పోటీపడ్డారు. చాలా మంది వాటిని సంచుల్లో కిలోల కొద్దీ నింపుకొని వెళ్లారు. దీంతో కళ్లు మూసి తెరిచే లోపే యాపిల్ పండ్ల లోడ్ మొత్తం ఖాళీ అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స కోసం తరలించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో అక్కడున్న వారు వ్యవహరించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
Read Latest Telangana News And National News