నవాబుల కోటలు కొల్లగొట్టిన పేదల పెన్నిది సర్దార్ సర్వాయి పాపన్న
ABN , Publish Date - Apr 01 , 2026 | 10:43 PM
తెలంగాణ పోరాటయోధుడు, విప్లవ వీరుడు సర్వాయి పాపన్న. అంతటి గొప్ప వ్యక్తికి ఇప్పటివరకు స్పష్టమైన జనన, మరణ తేదీలు లేకపోవడమనేది చారిత్రక ఆధారాల కొరత, మౌఖిక సంప్రదాయం ఆధిపత్యం, అధికారిక నిర్లక్ష్యం వంటి కారణాలనేకం. అయితే.. ఆ యోధుడికి సంబంధించిన జయంతి, వర్ధంతుల అధికారిక తేదీలు 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కథనం ద్వారా బహిర్గతమయ్యాయి. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ చరిత్రలో ప్రముఖ విప్లవ వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ప్రజల్లో విస్తృత గౌరవం ఉంది. అయినప్పటికీ.. ఆయనకు సంబంధించిన కచ్చితమైన జనన, మరణ తేదీలు ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా లభించడం లేదు. పాపన్న సుమారు 17వ శతాబ్దం చివరి నుంచి 18వ శతాబ్దం ప్రారంభం వరకు జీవించినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. అయితే.. ఆ కాలంలో ఆయన గురించిన పూర్తి లిఖితపూర్వక చరిత్ర నమోదు చేయడం సాధ్యం కాలేదని పూర్వీకులు చెబుతున్నారు. అందువల్ల ఆయన గురించి సమాచారం మౌఖిక కథనాల ద్వారానే తెలుస్తుంది తప్ప రాతపూర్వకంగా తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది.
వికీపీడియాలో ముందు ఉన్న జనన - మరణ సంవత్సరాలు

ఈ ఆధారాలు లేకపోవడానికి మరో కారణం.. మొఘల్ కాలంలో తిరుగుబాటు చేసిన స్థానిక నాయకుడిగా పాపన్నను పాలకులు నమోదు చేయకపోవడం. అందువల్ల ప్రభుత్వ పత్రాలు, రాజరిక రికార్డుల్లో ఆయనకు సముచిత స్థానం లభించలేదు. దీనివల్ల కూడా ఆయనకు సంబంధించిన కచ్చితమైన తేదీల నిర్ధారణను మరింత కష్టతరం చేసింది. కొన్ని ఆధారాలను చూస్తే.. ఆయన 1702-1709 మధ్య పాలన సాగించినట్టుగా, 1710 ప్రాంతంలో కన్నుమూసినట్టుగా చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇవి అంచనాలు మాత్రమే. అయితే.. ఆయన జనన, మరణాలకు సంబంధించిన కచ్చితమైన వివరాలను బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ ఇటీవల 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'కి అధికారికంగా వెల్లడించారు.
సర్వాయి పాపన్న జనన, మరణాలపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' తనను సంప్రదించిన సందర్భంగా అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. 'తెలంగాణ సమాజంలో సర్దార్ సర్వాయి పాపన్న ఓ చరిత్ర. మొఘల్ పాలనకు వ్యతిరేకంగా బహుజన కులాలను ఏకం చేసి తెలంగాణ స్వయంపాలన కోసం అమరులైన గొప్ప పోరాటయోధుడు. ప్రతి మనిషికి జనన, మరణాలు సహజం. అయితే.. పాపన్న జననం కంటే మరణం ఎంతో గొప్పది. అలాంటి వీరునికి ఇప్పటివరకు మరణ తేదీ లేదు. ఆయన హుస్నాబాద్ ప్రాంతంలో ఏప్రిల్ 2న అమరులైనట్టు తెలంగాణ మౌఖిక జానపద సాహిత్యంలో పేర్కొన్నారు. కాబట్టి ఏటా అదే రోజున ఆయన వర్ధంతిని నిర్వహిస్తున్నాం. 2022లో తెలంగాణ ప్రభుత్వం ఈ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ విధంగా ఆయన జయంతి, వర్ధంతులను రాష్ట్రవ్యాప్తంగా ఏటా సబ్బండ బహుజన కులాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో ఆయన విగ్రహాలు వెలుస్తున్నాయి. మరణానంతరం కూడా ఆ వీరుని గొప్పతనం తెలంగాణ సమాజం గుర్తించడం, గౌరవించడం అనేది ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
అంబాల నారాయణ గౌడ్ ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతులను వరుసగా ఏటా ఆగస్టు 18న, ఏప్రిల్ 2న అధికారికంగా జరుపుతోంది. ఇవి చారిత్రక నిర్ధారణ కంటే ప్రజల విశ్వాసం, సంప్రదాయం ఆధారంగా నిర్ణయించిన తేదీలుగా పరిగణించినట్టు ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం వికీపీడియాలో పాపన్న జనన - మరణ తేదీల వివరాలు..

ఇవీ చదవండి:
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
ఒంటిమిట్ట ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. స్పందించిన సిబ్బంది