పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టం.. భూసేకరణ ప్రక్రియ షురూ
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:16 PM
తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
వికారాబాద్ జిల్లా, జూన్ 24: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సయ్యద్పల్లి పరిసర ప్రాంతాల్లో భూములను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి భూసేకరణ, సర్వే ప్రక్రియ, ముంపు ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం దాదాపు 2,919 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. ఈ మేరకు భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా కసరత్తు చేయనున్నారు. 2.80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక భాగంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణలోని దాదాపు 4.97 లక్షల హెక్టార్ల భూములకు సాగునీరు అందనుంది. సాగునీటితో పాటు ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించనుంది. రిజర్వాయర్ నిర్మాణంతో పరిగి, వికారాబాద్, తాండూరు రైతుల పొలాలు సస్యశ్యామలం అవుతాయని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And Telugu News