Share News

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టం.. భూసేకరణ ప్రక్రియ షురూ

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:16 PM

తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టం.. భూసేకరణ ప్రక్రియ షురూ
Palamuru Rangareddy Project

వికారాబాద్ జిల్లా, జూన్ 24: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సయ్యద్‌పల్లి పరిసర ప్రాంతాల్లో భూములను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి భూసేకరణ, సర్వే ప్రక్రియ, ముంపు ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించారు.


లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం దాదాపు 2,919 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. ఈ మేరకు భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా కసరత్తు చేయనున్నారు. 2.80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక భాగంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణలోని దాదాపు 4.97 లక్షల హెక్టార్ల భూములకు సాగునీరు అందనుంది. సాగునీటితో పాటు ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించనుంది.​ రిజర్వాయర్ నిర్మాణంతో పరిగి, వికారాబాద్, తాండూరు రైతుల పొలాలు సస్యశ్యామలం అవుతాయని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 04:53 PM