Hyderabad Kite Festival: కైట్ ఫెస్టివల్.. సందర్శకులను ఆకర్షిస్తున్న రంగురంగుల గాలిపటాలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:42 PM
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నగరవాసులు పరేడ్ గ్రౌండ్కు క్యూ కడుతున్నారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 15: సంక్రాంతి సంబరాల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ (Hyderabad Kite Festival) మూడో రోజుకు చేరుకుంది. జనవరి 13న ఈ ఫెస్టివల్ ప్రారంభంకాగా.. నేటితో ముగియనుంది. దీంతో ఫెస్టివల్ చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నగరవాసులు పరేడ్ గ్రౌండ్కు క్యూ కడుతున్నారు. గత రెండు రోజుల్లో ఈ ఫెస్టివల్కు ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘సెలబ్రేట్ ది స్కై’ (Celebrate the Sky) పేరుతో జరుగుతున్న ఈ ఫెస్టివల్లో విదేశీ కైట్స్ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. 19 దేశాల నుంచి వచ్చిన 40మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 జాతీయ కైట్ ఫ్లయర్స్.. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొని డ్రాగన్లు, డాల్ఫిన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, ఇతర అద్భుత డిజైన్ల గాలిపటాలను ఎగురవేస్తున్నారు.
రంగురంగుల పతంగులు ఆకాశంలో ఎగురుతూ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, ఫోక్ ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాలు, దేశాల సంప్రదాయ మిఠాయిలు, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్స్ స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఈ సంక్రాంతి చరిత్రను తిరగరాసింది: సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News