మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి కేసీఆర్
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:02 AM
ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ముఖ్యమంత్రిగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి పెట్టకుంటే.. ఈ రోజు రేవంత్రెడ్డి సీఎం అయ్యే వారే కాదని అన్నారు.
తెలంగాణ సాధించిన వ్యక్తిని రాజీనామా చేయమని అడిగే అర్హత రేవంత్కు లేదు
సెటిల్మెంట్లకు అడ్డాగా సీఎం రేవంత్ ఇల్లు
ఓట్లేసిన విద్యార్థులే ఆ పార్టీకి పిండాలు పెడతారు: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ముఖ్యమంత్రిగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి పెట్టకుంటే.. ఈ రోజు రేవంత్రెడ్డి సీఎం అయ్యే వారే కాదని అన్నారు. అలాంటి వ్యక్తిని రాజీనామా చేయాలని మాట్లాడుతున్న రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. సింగపూర్లో లీ కువాన్ యూను గౌరవించుకున్న మాదిరిగానే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను శాశ్వతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్రెడ్డి వెయ్యి రోజుల పాలన అన్ని రంగాల్లో అట్టర్ఫ్లాప్ అని విమర్శించారు. రేవంత్రెడ్డి మాటల్లో చెప్పాలంటే.. క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై రూపొందించిన చార్జిషీట్ను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో జరిగిన 30 స్కాములను ఆయన చదివి వినిపించారు. సీఎం రేవంత్రెడ్డి ఇల్లే సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందని, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టి బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి కొనసాగుతోందన్నారు. అజ్ఞానం, అబద్ధం, అరాచకం, అవినీతి అనే నాలుగు తలల బుస కొడుతున్న అనుముల నాగుపాము రాష్ట్రాన్ని పాలిస్తోందని, 30శాతం కమీషన్ లేకపోతే ఏ పనీ చేయడంలేదని ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల పాలనలో అనుముల బ్రదర్స్ ఆనకొండల్లా ఎదిగిపోయారని విమర్శించారు. అక్రమ సంపాదన విషయంలో తలెత్తిన విభేదాల వల్లే.. మంత్రులు బహిరంగంగా తన్నుకుంటున్నారన్నారు. ఎంగిలి మెతుకుల కోసం కుక్కలు కొట్లాడుకుంటున్నట్లుగా.. మంత్రివర్గంలో కీచులాటలు జరుగుతున్నాయన్నారు.రాష్ట్ర ఆర్థిక ఇంజన్ అయిన హైదరాబాద్ను పూర్తిగా కుప్పకూల్చారని, కమీషన్లు ఇస్తేనే ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేస్తామంటూ సెటిల్మెంట్లు చేస్తున్నారన్నారు. గోదావరి నీళ్లను చంద్రబాబుకు సమర్పించేసి.. తెలంగాణ హక్కులకు రేవంత్ తీరని నష్టం కలిగించారన్నారు. గత ఎన్నికల్లో ఓట్లు వేయించిన విద్యార్థులే.. వచ్చేసారి కాంగ్రె్సకు పిండాలు పెడతారని హెచ్చరించారు. రాష్ట్రంలోఅచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ లేదని, ఉన్నది కేవలం లుచ్చా కాంగ్రెస్ మాత్రమేనని విద్యార్థులు అనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై వారం పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం.. 12 మంది మృతి..