Share News

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నిలిచిపోయిన తాగునీటి సరఫరా..

ABN , Publish Date - Jun 11 , 2026 | 08:46 PM

భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులు అలర్ట్ జారీ చేశారు. తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడినట్లు తెలిపారు.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నిలిచిపోయిన తాగునీటి సరఫరా..
Hyderabad Water Supply Issue

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులు అలర్ట్ జారీ చేశారు. తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో లీకేజీ గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు.


ముఖ్యంగా ఆర్‌.సి.పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ ప్రాంతాలకు నీటి సరఫరాలో సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. అలాగే అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. అయితే, మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు.


లీకేజీ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని హెఎమ్‌డబ్ల్యూఎస్ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలు సహకరించాలని, అవసరమైతే ట్యాంకర్ల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేవంత్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటి?: ఎంపీ డీకే అరుణ

విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు..

Updated Date - Jun 11 , 2026 | 08:50 PM