సమయమిచ్చినా మీనాక్షి నటరాజన్ సద్వినియోగం చేసుకోలేదు..
ABN , Publish Date - Jul 17 , 2026 | 08:32 PM
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురించి.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ సమయమిచ్చినా సద్వినియోగం చేసుకోలేదన్నారు.
ఢిల్లీ, జులై 17: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఉదంతం జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిబంధనల అమలు, అఫిడవిట్ల దాఖలు విషయంలో కమిషన్ ఎంత కఠినంగా ఉంటుందో ఆయన స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో జరిగిన ఒక ప్రత్యేక చిట్-చాట్లో ఆయన ఈ వ్యవహారంపై తెరవెనుక ఉన్న అసలు వాస్తవాలను వెల్లడించారు.
నిబంధనలు అందరికీ ఒకటే.. ప్రతీ కాలమ్ భర్తీ చేయాల్సిందే!
నామినేషన్ పత్రాలను నింపే విషయంలో అభ్యర్థులు కచ్చితంగా పూర్తి నిబంధనలు పాటించాల్సిందేనని సీఈసీ తేల్చి చెప్పారు. 'నామినేషన్ ఫామ్లో అడిగిన ప్రతీ ఒక్క కాలమ్ను (Column) అభ్యర్థులు తప్పనిసరిగా భర్తీ చేయాలి. చట్టసభలకు పోటీ చేసేటప్పుడు ఏ చిన్న సమాచారాన్ని దాచినా అది నామినేషన్ చెల్లుబాటునే ప్రమాదంలో పడేస్తుంది' అని జ్ఞానేష్ కుమార్ చెప్పారు.
కొన్ని సందర్భాల్లో ఎన్నికల అధికారులు (Returning Officers) మానవీయ కోణంలోనో లేదా పొరపాటునో చూసీచూడనట్లు వదిలేసినా... రాజకీయ ప్రత్యర్థులు మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టరని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో కూడా రాజకీయ ప్రత్యర్థులు సదరు తప్పును పట్టుకుని, అధికారికంగా ఫిర్యాదు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఒకవేళ ప్రత్యర్థులు ఫిర్యాదు చేయకపోతే ఈ నామినేషన్ స్కృటినీ ప్రక్రియ మరోలా ఉండేదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.
సమయమిచ్చినా సద్వినియోగం చేసుకోలేదు!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు ప్రధాన కారణమైన 'తెలంగాణ కోర్టు కేసు వివరాల' సమర్పణపై సీఈసీ స్పష్టత ఇచ్చారు. అఫిడవిట్లో ఆ కోర్టు కేసు వివరాలను భర్తీ చేయడానికి రిటర్నింగ్ అధికారి (RO) ఆమెకు తగిన సమయం ఇచ్చారని, అయితే ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు.
ఒకసారి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రిటర్నింగ్ అధికారి (RO) స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకుంటారని, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అది కేంద్ర ఎన్నికల కమిషనర్ పరిధిలోకి కూడా రాదని, తాము అందులో జోక్యం చేసుకోలేమని సీఈసీ కి ఉన్న చట్టబద్ధమైన పరిమితులను ఆయన వివరించారు.
సుప్రీంకోర్టు సైతం ఆర్ఓ (RO) నిర్ణయాన్నే సమర్థించింది
ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. న్యాయస్థానం సైతం రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని, అందులోని న్యాయబద్ధతను సమర్థించిందని సీఈసీ గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు