విషాదం: వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
ABN , Publish Date - Sep 11 , 2026 | 10:02 AM
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటూ సందడి చేసిన నాలుగేళ్ల మానస.. క్షణాల్లో వేడి నీళ్ల బకెట్లో పడి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇక లేదన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రగతినగర్లో ప్రమాదవశాత్తూ వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేళ్ల చిన్నారి మానస మృతి చెందింది. స్నానం కోసం తల్లి వాటర్ హీటర్తో బకెట్లో నీళ్లు వేడి చేస్తుండగా.. ఆమెకు ఫోన్ రావడంతో కొద్దిసేపు బయటకు వెళ్లింది. అదే సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ వేడి నీళ్ల బకెట్లో పడిపోయింది. దీంతో చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మానసను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది.
మానస కుటుంబం స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా కాగా.. ఉపాధి కోసం కొంతకాలంగా ప్రగతినగర్లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి అనూహ్యంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షణకాల నిర్లక్ష్యం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఘటనపై సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని కోల్పోయిన కుటుంబాన్ని స్థానికులు పరామర్శించి ఓదార్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా స
హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!
For More Weather News And Telugu News