పబ్కు రప్పించేందుకు అమ్మాయిలతో చాటింగ్.. కూకట్పల్లి పబ్ మేనేజర్ అరెస్ట్
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:33 PM
హైదరాబాద్ నగరం కూకట్పల్లిలోని మంజీరా మాల్లో గల ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్పై డీసీపీ రితిరాజ్ అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుపు దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకూ లౌడ్ మ్యూజిక్తో హంగామా చేస్తూ, ప్రత్యేక డ్యాన్స్ ఫ్లోర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.
హైదరాబాద్, జూన్ 07: ఈ మధ్య కాలంలో ఈజీగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న కొంతమంది కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే యువకులకు అమ్మాయిలతో చాటింగ్తో చేయించి, పబ్బులకు రప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసే అతి సాధారణమైన ఫుడ్, డ్రింక్స్కు కూడా ఊహించని విధంగా వేల రూపాయల్లో బిల్లులు వేసి యువకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోవడంతో బాధితుల సంఖ్య కూడా రోజురోజుకూ ఎక్కువవుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలతో ప్రత్యేకంగా చాటింగ్ చేయిస్తూ భారీ దందా సాగిస్తున్న ఒక పబ్ గుట్టును పోలీసులు తాజాగా రట్టు చేశారు.
కూకట్పల్లి (కేపీహెచ్బీ) లోని మంజీరా మాల్లో ఉన్న ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్పై సైబరాబాద్ డీసీపీ రితిరాజ్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ తెల్లవారుజాము వరకు గానా బజానాతో హంగామా చేయడమే కాకుండా.. ప్రత్యేకంగా డ్యాన్స్ ఫ్లోర్ను ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు ఈ తనిఖీల్లో తేలింది. యువకులను పబ్కు రప్పించడం కోసం యాజమాన్యం అమ్మాయిలతో చాటింగ్లు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి పబ్ మేనేజర్ను అరెస్ట్ చేసిన పోలీసులు, అక్కడున్న విటులతో పాటు యువతులు సహా మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య
2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
Read Latest AP News And Telugu News